8 లక్షల కోట్లు తెస్తా.. ఎకనామిక్ సమ్మిట్ పెడితే, మోడీపై కేఏ పాల్ విసుర్లు
ప్రధాని మోడీపై కూడా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ విరుచుకుపడుతున్నారు. ఇన్నాళ్లూ కేసీఆర్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు మోడీని కూడా వదలడం లేదు. టీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఎకనామిక్ సమ్మిట్ పెట్టమని ప్రధాని మోడీని అడిగినా పెట్టడం లేదని కేఏ పాల్ అన్నారు. 8 లక్షల కోట్లు తెస్తామని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గుండెల్లో రైళ్లు..
సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్ను టీఆర్ఎస్ బ్యానర్లతో నింపేశారని తెలిపారు. అన్ని పార్టీల నేతలు తమ పార్టీలో చేరుతున్నారని వివరించారు. గతంలో రాహూల్ గాంధీ, కేసీఆర్, ఇవాళ మోడీ మీటింగ్ పెడుతున్నారని, జనాలను మాత్రం డబ్బులు ఇచ్చి మీటింగ్లకు తీసుకొస్తున్నారని అన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఇలా
బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నారని, రాజకీయ నేతలుగా ఉండి అలా మాట్లాడటానికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏడేళ్లలో 50 లక్షల కోట్లు అప్పు చేశారని కేంద్ర ప్రభుత్వ తీరుపై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని, నల్లదనం తెస్తామని అదీ చేయలేదని, అదానికి మాత్రం లాభం చేకూర్చారని మోడీ పాలన తీరుపై విమర్శలు గుప్పించారు. మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని, భయంతో బతుకుతున్నారని కేఏ పాల్ అన్నారు.
మహిళలకు లేని రక్షణ
మహిళలకు రక్షణ లేదని, 3 ట్రిలియన్ డాలర్లు ఎకానమీని 5 ట్రిలియన్ డాలర్లు చేస్తామన్నారని తెలిపారు. దేశం ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడ ఫ్లెక్సీల కోసం కొట్లాట ఏమిటని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతల తీరుపై కేఏ పాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ చెల్లించిన పన్నులు కేంద్ర ప్రభుత్వం నుంచి తిరిగి రావడం లేదని కేఏ పాల్ అన్నారు.
సహకరించి ఇప్పుడు ఇలా..
బీజేపీకి సీఎం కేసీఆర్ 8 ఏళ్లు సహకరించారని తెలిపారు. అందుకే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అప్పులు పెరిగాయని, కేసీఆర్ ఆస్తులు అన్నీ అమ్మేస్తున్నారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ను పెట్టుకొని 10 వేల కోట్లు ఖర్చు చేసి మళ్ళీ గెలుస్తామని కేసీఆర్ అనుకుంటున్నారని.. కానీ తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.