కాంగ్రెస్లోకి కత్తి కార్తీక: మధుయాష్కీతో భేటీ.. రేవంత్ సమక్షంలో
ప్రముఖ యాంకర్ కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది. ఈ క్రమంలోనే మధుయాష్కీ గౌడ్తో భేటీ అయ్యారు. కత్తి కార్తీక ఫార్వర్డ్ బ్లాక్ తరఫున దుబ్బాక అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లోనూ పోటీ కూడా చేశారు. ఇక్కడ ఘోరపరాజయం ఎదుర్కొన్నారు. అప్పటి నుండి యాక్టివ్ రాజకీయాలలోకి దిగేందుకు సరైన ఫ్లాట్ ఫామ్ కోసం ముమ్మర వేటలో ఉన్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కత్తి కార్తీక బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ముమ్మర ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కార్తీక భేటీ కావడం కూడా మరింత బలాన్ని ఇచ్చింది. కానీ అది జరగలేదు. ఫైనల్ గా ఇప్పుడు కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆదివారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో కత్తి కార్తీక సమావేశమయ్యారు. ప్రచార కమిటీ చైర్మన్గా నియమితులైన మధుయాష్కీకి శుభాకాంక్షలు తెలిపినట్లు కార్తీక తెలిపారు.
మధుయాష్కీ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కత్తి కార్తీకను ఆహ్వానించగా.. అందుకు కార్తీక కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరికపై తెలంగాణ రాజకీయాలలో ఒకరకంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టీఆర్ఎస్ కీలక నేత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు దగ్గరి బంధువు అవుతారు.