కేసీఆర్ దత్తపుత్రిక వివాహం.. సోమవారం క్రిస్టియన్ సంప్రదాయం పెళ్లి..ప్రదానం చేసేదీ వీరే...
తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 28వ తేదీ సోమవారం వివాహం జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత ఆలయంలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు వివాహం జరగనుండగా.. పెళ్లి ఏర్పాట్లను స్త్రీ శిశు సంక్షేమ శాఖ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.
Recommended Video
క్రైస్తవ సంప్రదాయం ప్రకారం..
హైదరాబాద్లోని రాంనగర్కు చెందిన ఉడుముల జైన్మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్రెడ్డితో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తారు. ప్రత్యూషకు చరణ్రెడ్డితో అక్టోబరులో విద్యానగర్లోని ఓ హోటల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ప్రత్యూష కుటుంబంతో తమకు చుట్టరికం కూడా ఉందని చరణ్రెడ్డి బంధువులు తెలిపారు. చరణ్రెడ్డి అమ్మమ్మ గ్రామం పాటిగడ్డ కావడంతో ఇక్కడ వివాహం చేస్తున్నారు.
ఇక్కడ ప్రదానం..
డిసెంబరు 27వ తేదీ ఆదివారం బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రధానం నిర్వహిస్తారు. 28న వివాహం జరపడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానం కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్తోపాటు ప్రభుత్వ అధికారులు హాజరవుతారని వరుడి తరఫున బంధువులు తెలిపారు. ప్రత్యూష పెండ్లికి రావాలని అధికారులు సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. వధువు ప్రత్యూషకు నిమ్స్లో ఉద్యోగం ఇస్తాను అని సీఎం హామీ ఇచ్చినట్టు శిశుసంక్షేమశాఖ జేడీ (స్కీమ్స్) కేఆర్ఎస్ లక్ష్మి వెల్లడించారు.
తండ్రి, సవతి తల్లి హింసించడంతో..
రంగారెడ్డి జిల్లాలో ఐదేళ్ల కింద కన్న తండ్రి, సవతి తల్లి హింసకు ప్రత్యూష గురయ్యింది. విషయం మీడియాలో రావడంతో సీఎం కేసీఆర్ చలించిపోయారు. ఆమెను దత్తత తీసుకొన్నారు. సీఎం ఆదేశాలతో ఆమె వసతి, విద్య, ఇతర బాగోగులను మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు చూసుకుంటున్నారు. ప్రత్యూష ఇటీవల నర్సింగ్ విద్య కూడా పూర్తిచేసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తోంది. రెండురోజుల్లో ఓ ఇంటి వెలుగు కాబోతుంది.