కేసీఆర్, జగన్ హస్తిన టూర్ : ప్రధానితో భేటీ..మతలబు ఏదైనా ఉందా ? ఆసక్తికర చర్చ
Recommended Video
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన పర్యటన చేయనున్నారు.ఒక్క రోజు తేడాతో ప్రధాన మంత్రితో ఇద్దరు తెలుగు సీఎంలు భేటీ కానున్నారు. కెసీఆర్ వెళుతున్నారనగానే ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళుతున్నారు. కెసీఆర్ ప్రధానిని కలిసిన మర్నాడే జగన్ కూడా ప్రధానితో భేటీ కాబోతున్నారు. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ ఒకేసారి ఎందుకు హస్తినకు వెళుతున్నారు? ప్రధాని నరేంద్ర మోడీతో భేటీలో ఏం మాట్లాడబోతున్నారు? అన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ప్రభాస్కు నై..చిరుకు సై: తెర వెనుక చక్రం తిప్పిందెవరు: జగన్ అంగీకారం వెనుక!
ఒకేసారి తెలుగురాష్ట్రాల సీఎం ల హస్తిన టూర్ పై చర్చ
తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలవడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు . దేశంలోని ప్రతీ ముఖ్యమంత్రి చేసే పనే అది. ప్రతి రాష్ట్రంలోనూ, తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేంద్ర సహకారాన్ని కోరడానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కలవటం పరిపాటే. కానీ కెసీఆర్, జగన్ వెళుతున్నారు అనగానే ఇద్దరూ ఒకేసారి హస్తిన టూర్ ప్లాన్ చేయడంతో తెలుగు రాష్ట్రాలలో అదే పెద్ద చర్చనీయాంశంగా మారింది.
హస్తిన వేదికగా జగన్ , కేసీఆర్ ఏం చెయ్యబోతున్నారు
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎవరి అజెండా వారిదే అయినా ఒకేసారి వెళ్లాల్సిన అవసరం ఏంటి? కెసీఆర్ పర్యటన వివరాలు వెల్లడైన కొన్ని గంటల్లోనే జగన్ ఢిల్లీ టూర్ వివరాలను ప్రకటించారు. కెసిఆర్ తో పాటు జగన్ కూడా ఢిల్లీ టూర్ ప్లాన్ చేయటం ఏమిటి ? హస్తిన వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేయబోతున్నారు ? అన్న అంశాలపై సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది . ఇద్దరు ముఖ్యమంత్రులు పర్యటనలో అజెండాలో కామన్ గా ఉండే అంశాలు ఏంటి అన్న వాటిని గమనిస్తే కొన్ని అంశాలు కామన్ గా కనిపిస్తున్నాయి.
పీఎంతో భేటీలో ప్రస్తావనకు వచ్చే కామన్ అంశాలు
పెండింగ్లో ఉన్న విభజన అంశాలను పూర్తి చేయాలని, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని జగన్ కోరనున్నట్లు గా తెలుస్తోంది. ఇక సీఎం కేసీఆర్ సైతం పెండింగ్లో ఉన్న విభజన అంశాలపైన, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సహకారం అందించాలని ప్రధానంగా ప్రధానితో చర్చించనున్నారు. ఇక అంతే కాదు గోదావరి జలాలను కృష్ణానదికి తరలించడం ద్వారా, నదుల అనుసంధానం చేయాలని భావిస్తున్న ఇరు రాష్ట్రాల సీఎంలు వేర్వేరుగా ప్రధానితో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది.
కేంద్ర సర్కార్ పై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల సీఎం లు
ఒకపక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర సర్కార్ వైఖరిపై కాస్త గుర్రు గానే ఉన్నారు. ఈ సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల టూర్ పై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని ఏపీ లోని బిజెపి నేతలు వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పాలన వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇక అంతే కాదు ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చే నేతలను స్వాగతిస్తున్నారు.
తెలంగాణా సీఎం కేసీఆర్ కు నచ్చని బీజేపీ తీరు
తెలంగాణ రాష్ట్రంలో సైతం బిజెపి, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలి అని ఇప్పటి నుంచే గట్టిగా పని చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సైతం బిజెపి నేతల తీరును తట్టుకోలేకపోతున్నారు. కేంద్ర సర్కార్ పై ఆగ్రహంతో ఉన్నారు.
జగన్, కేసీఆర్ విన్నపాలకు మోడీ సానుకూలంగా స్పందిస్తారా ?
ఇక ఈ సమయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తమ విన్నపాలు వినవలె అంటూ విన్నవించుకోనున్నారు. మరి ప్రధాని నరేంద్ర మోడీ వీరిరువురి విన్నపాలు విని సానుకూలంగా స్పందిస్తారా! హస్తిన వేదికగా కలవనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో వీరి భేటీలో మతలబేంటి? వీరి అభ్యర్థనలను మోడీ పట్టించుకుంటారా అనేది ఈ రెండు రోజుల్లోనే తేలనుంది.