గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు..
11 రోజులపాటు భక్తుల నుంచి విశేష పూజలు అందుకొన్న ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరారు. మంగళవారం సాయంత్రం ట్యాంక్ బండ్పై నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది. క్రేన్ నెంబర్ 4 వద్ద గణనాథుడు నిమజ్జనం చేశారు. కరోనా వైరస్ వల్ల కోవిడ్-19 నిబంధనలతో నిమజ్జన ప్రక్రియ కొనసాగింది. గణనాథులను చూసేందుకు భక్తుల సందడి కూడా పెద్దగా కనిపించలేదు.
వినాయకుడి శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గం గుండా సాగింది. శోభాయాత్రలో ధన్వంతరి అవతారంలో గణేశుడు దర్శనం ఇచ్చారు. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతించలేదు.
ప్రతి ఏటా భారీ గణనాథుడికి పూజలు నిర్వహించేవారు. కరోనా వైరస్ వల్ల ఈసారి 9 అడుగుల వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం గణేశ్ నిమజ్జనం రోజున భాగ్యనగరం కిక్కిరిపోయేది. కానీ మాత్రం ఈ సారి నిమజ్జన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రహదారిపై జనం పెద్దగా కనిపించలేదు.