వెంకట్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లే ఛాన్స్..? రాం రెడ్డి దామోదర్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. వెంకట్ రెడ్డి కూడా అమిత్ షాను కలిసినట్టు తెలుస్తోంది. ఆయన కూడా పార్టీ మారతారా అనే చర్చ జరుగుతుంది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్యూపై సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్పందించారు. వారిద్దరి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వారికి అన్ని ఇచ్చిందని గుర్తుచేశారు.
ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాలను కల్పించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంతో లబ్ధి పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దారుణమని అన్నారు. ఏపీలో కేఏ పాల్, తెలంగాణలో రాజగోపాల్ ఇద్దరూ ఒకటేనని వివరించారు. ఏం మాట్లాడతారో వారికే తెలియదని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఒకే రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని గుర్తుచేశారు.
వెంకటరెడ్డి తీరు చూస్తుంటే ఆయన కూడా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చండూరు సభకు హాజరు కాకుండా... అమిత్ షాను కలిసేందుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. పార్టీ వీడే ఉద్దేశం ఉంటేనే తమ్ముడితో కలిసి వెళ్లి ఉంటారని చెప్పారు. ఆయన ఇప్పుడు కాకుంటే మరో సందర్భంలో బయట పడతారని తెలిపారు.
అంతకుముందు రాజగోపాల్ రెడ్డితో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కూడా చర్చలు జరిపినా ససేమిరా అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా మునుగోడు ఉపఎన్నికే కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఉపఎన్నికతో మునుగోడును డెవలప్ చేయడం, కేసీఆర్కు గుణపాఠం చెప్పడమే తన ఎజెండా అన్నారు.