మునిసిపల్ అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్ మాస్టర్ ప్లాన్ .. అదేంటంటే
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది . జనవరి 22న జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటి నుండే కసరత్తులు పెట్టాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నద్ధం అవుతున్నాయి. ఇంతవరకు ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగానే పావులు కదుపుతుంది.
News Maker 2019: కేటీఆర్కు కలిసొచ్చిన సంవత్సరం, వర్కింగ్ ప్రెసిడెంట్గా, మంత్రిగా సూపర్ సక్సెస్
రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటీ అయిన కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సారి మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించేలా అభ్యర్థుల ఎంపిక నుండి తగు జాగ్రహ్హలు తీసుకుంటున్నారు. అయితే మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఈసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్రి సభ్య కమిటీని వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు . టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నేడు కేటీఆర్ తెలంగాణ భవన్లో రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు.
మున్సిపల్ ఎన్నికలే ప్రధాన అజెండాగా సమావేశం
మునిసిపల్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేటీఆర్ అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంలో అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై రాష్ట్ర కమిటీ సభ్యులతో చర్చించారు.ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు లేవకుండా గట్టిగా దెబ్బ కొట్టాలని సూచించారు. అయితే ముందుగా అభ్యర్థుల ఎంపిక సవాల్గా మారిన పరిస్థితిలో అందుకోసం కేటీఆర్ తన అపర చాణిక్యం ప్రదర్శించాలని భావిస్తున్నారు.
అందరికీ ఆమోదయోగ్యం అయ్యేలా అభ్యర్థుల ఎంపికకు త్రి సభ్య కమిటీ
గత అయిదేళ్ళలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కొత్తగా చేరిన పలువురితోపాటు మొదట్నించి టీఆర్ఎస్ పార్టీలో వున్నవారు చాలా మంది ఆశావహులు పెద్ద ఎత్తున మునిసిపల్ ఎన్నికల్లో టిక్కెట్లను ఆశిస్తున్నారు. ఇక వీరిని అందరినీ ఏకతాటి మీదకు తీసుకురావటానికి ఆయన కొత్త వ్యూహం అనుసరిస్తున్నారు. వీరిలో అసమ్మతి, అసంతృప్తి లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయడానికి త్రిసభ్య కమిటీ నియమించాలని నిర్ణయించారు. వీరు జిల్లాల వారీగా మునిసిపల్ అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసి, జిల్లా అధ్యక్షులకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. అనంతరం జిల్లా కమిటీలు మునిసిపల్ అభ్యర్థుల ఆశావహుల జాబితాలను రూపొందిస్తారు.
తుది జాబితా కేటీఆర్ సమక్షంలో ఫైనల్ చెయ్యనున్న కమిటీ
ఆ తర్వాత రాష్ట్ర స్థాయి త్రిసభ్య కమిటీ ఆ జాబితాలను మరోసారి పరిశీలించి, వారిలో ఎవరు బెస్ట్ అని భావిస్తారో వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తుది జాబితాను రూపొందిస్తుంది. తుది జాబితాపై అధినేత కేసీఆర్ అనుమతి తీసుకుని, అభ్యర్థులను ప్రకటించాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఎవరి అలకలకు, గొడవలకు తావు లేకుండా అభ్యర్థుల ఎంపిక చెయ్యాలని మాస్టర్ ప్లాన్ వేశారు కేటీఆర్.