గల్లా జయదేవ్కు కేటీఆర్ రెడ్ కార్పెట్: మారిన అమరరాజా రూటు; ఏపీ టు తెలంగాణ!!
పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న కంపెనీలను స్వాగతిస్తుంది. ఇందులో భాగంగా పారిశ్రామిక రాయితీలను ప్రకటించి, వారికి కావలసిన మౌలిక వసతులు కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం టీడీపీ ఎంపీ, పారిశ్రామిక వేత్త అయిన గల్లా జయదేవ్ కు రెడ్ కార్పెట్ పరుస్తుంది.
రూటు మారిన అమరరాజా బ్యాటరీస్ .. గల్లాకు తెలంగాణా రెడ్ కార్పెట్
అమరరాజా సంస్థ రూటు మారింది. ఏపీ నుండి తెలంగాణాకు తన వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో తమ సంస్థను విస్తరించాలని భావించిన అమర రాజా బ్యాటరీస్, రాష్ట్రంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను బాగా విస్తరించాలని భావించిన సంస్థ అధినేత గల్లా జయదేవ్, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కావడంతో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో అమరరాజా బ్యాటరీస్ పై రాజకీయ దుమారం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుసంబంధించిన అమర రాజా బ్యాటరీస్ కంపెనీరెండు యూనిట్లను మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసు జారీ చేసిన తర్వాత, రెండు సార్లు అమరరాజా బ్యాటరీస్ సంస్థకు విద్యుత్ నిలిపివేసిన ఘటనలతో దానిపై రాజకీయంగా రగడ జరిగింది. ఇక ఈ క్రమంలో అమర రాజా బ్యాటరీస్ చెన్నై కి తరలి పోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక అటువంటిదేమీ లేదని చెప్పిన గల్లా జయదేవ్ ఇప్పుడు ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
నేడు తెలంగాణా ప్రభుత్వంతో అమరరాజా ఒప్పందం
అయితే తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పెద్దపెద్ద పరిశ్రమలను ఆహ్వానిస్తున్న క్రమంలో, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమర రాజా బ్యాటరీస్ సంస్థ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే నేడు అమర రాజా లిథియం ఇయాన్ గిగా ఫ్యాక్టరీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకోనుంది. హైదరాబాద్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీడీపీ ఎంపీ, అమర రాజా బ్యాటరీస్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ లు తెలంగాణ ప్రభుత్వం తో అమర రాజా బ్యాటరీస్ సంస్థ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొననున్నారు.