లే అవుట్కు రూ.8 లక్షల డిమాండ్, ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు, అరెస్ట్
హైదరాబాద్ : చేసేది పవిత్ర ఆలయంలో ఉద్యోగం. మంచి హోదా, స్థానం, వేతనం. అయినా బుద్ధి తప్పాడు. కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. సౌఖ్యంగా ఉద్యోగం చేసుకోవాల్సింది పోయి .. కటకటలపాలై .. ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
8 లక్షల లంచం ?
వేములవాడ ఆలయ అభివృద్ధి ముఖ్య ప్రణాళికాధికారిగా లక్ష్మణ్ గౌడ్ పనిచేస్తున్నాడు. వేములవాడకు చెందిన సంపత్ అనే వ్యక్తి రుద్రారంలో 8 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమికి సంబంధించిన లేఅవుట్ అనుమతి కోసం లక్ష్మణ్ ను ఆవ్రయించాడు. అనుమతి కోసం రరూ.8 లక్షలు అడిగాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పడంతో ... వీరి మధ్య 6.5 లక్షలకు బేరం కుదిరింది.
ఏసీబీని ఆశ్రయించాడు
చివరకు నగదు ఇచ్చే రోజు రానే వచ్చింది. అయితే లక్ష్మణ్ కు డబ్బులు ఇచ్చేందుకు సంపత్ మనసు ఏ మాత్రం ఒప్పలేదు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. తర్వాత లక్ష్మణ్ సూచనమేరకు హైదరాబాద్ లోని కోఠిలో గల నివాసానికి వెళ్లాడు. ఇంట్లో లక్ష్మణ్ లేకపోవడంతో అతని కుమారుడికి లంచం ఇచ్చాడు. అప్పటికే ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగదును సీజ్ చేసి లక్ష్మణ్ గౌడ్, అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం వారిని వేములవాడ తరలిస్తున్నట్టు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య పేర్కొన్నారు.
ఫిర్యాదు చేయండి
లంచం తీసుకోవద్దని .. కఠినచర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు చెబుతున్న కొందరు అధికారులు పెడచెవిన పెడుతున్నారు. పని కోసం వచ్చిన వారిని జలగల్లా పీల్చుకు తింటున్నారు. దీంతో కొందరు ఏసీబీని ఆశ్రయించే ధైర్యం చేస్తుండగా ... మరికొందరు తమకెందులే అని ఊరుకుంటున్నారు. ఎవరికైనా సమస్య ఉంటే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు పదే పదే చెప్తున్నారు. వారి టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఇచ్చి .. ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.