LIC: ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఏజెంట్ల దేశవ్యాప్త ఉద్యమం.. వేదిక కానున్న హైదరాబాద్..
భారత జీవిత బీమా సంస్థ అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు దేశ వ్యాప్తంగా ఉద్యమ బాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ మూడు కేటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ వేదిక కానుంది.ఎల్ఐసీని ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తుంది. దీన్ని ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సంస్థలను ప్రైవేట్ పరం చేసింది. ఎల్ఐసీని కూడా ప్రైవేటీకరించాలని చూస్తోంది.
దీనికి వ్యతిరేకంగా ఎల్ఐసీ అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగానే ఈనెల 29న హైదరాబాద్ లో నిర్వహించనున్న దేశవ్యాప్త ప్రతినిధుల సమావేశంలో ఎల్ఐసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మంగళవారం ఎల్ఐసీ అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు, ట్రేడ్ యూనియన్ నాయకులతో జరిగిన సన్నాహాక సమావేశంలో తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.ఎల్ఐసీ ఉద్యోగ కార్మిక వర్గం చేసే ఉద్యమానికి టీఆర్ఎస్ కార్మిక విభాగం సంపూర్ణంగా అండగా నిలుస్తుందని తెలిపారు. ఎల్ఐసీ అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు అన్ని రకాల ఉద్యమ సహాయ సహకారాలు అందిస్తామని బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు.

ఎల్ఐసీని ప్రైవేటీకరించే కేంద్ర బీజేపీ ప్రభుత్వ చర్యలను ప్రజల్లో ఎండగడతామని వినోద్ కుమార్ చెప్పారు. ఎల్ఐసీ ప్రకటించే ఉద్యమ కార్యాచరణను టీఆర్ఎస్ మద్దతునిస్తుందని వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ సన్నాహక సమావేశంలో ఎల్ఐసీ ఏజెంట్ల జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచారి, రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, వివిధ డివిజన్ల నాయకులు తిరుపతయ్య, రఘు, రవీంద్రనాథ్, జేఏసీ చైర్మన్ బిఎన్ చారి, టిఆర్ఎస్ కార్మిక విభాగం ఇన్చార్జి ఎల్. రూప్ సింగ్, సి.ఐ.టి.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.