ప్రేమలో నిజమెంత?: ప్రియుడి కోసం ప్రియురాలు.. యువతి కోసం యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్: పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో విషాద ఘనట చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
యువతి వెంట పడొద్దంటూ హెచ్చరిక..
వివరాల్లోకి వెళితే.. లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన చిన్న కుమార్తెతో కలిసి ఉంటోంది. భర్త లక్ష్మారెడ్డి కోహిర్ మండలం పీచేరేగడిలో వేరుగా ఉంటున్నారు. బీకాం పూర్తి చేసి ఆమె ఇంటివద్ద ఉంటోంది. ఏడాదిన్నర క్రితం నుంచి పక్కింటిలో ఉన్న వెంకటరాం, శ్రావణి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన ఆమె మేనమామ రాజేశ్వర్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోరని వెంటరాం సమాధానం ఇచ్చాడు. ఇకపై ఆ అమ్మాయి వెంటపడొద్దని హెచ్చరించాడు.
పెళ్లికి నిరాకరిస్తూ.. యువతి వెంటపడేవాడు..
కాగా, కొంత కాలతం తర్వాత రాజేశ్వర్ రెడ్డి మృతి చెందిన 11 నెలల క్రితం మళ్లీ ఆ యువతి వెంటపడేవాడు. పలుమార్లు ఆమె తల్లి కూడా సదరు యువకుడిని తన కూతురుతో ఫోన్లో మాట్లాడవద్దని మందలించింది. ఈ క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదని కొన్ని రోజులుగా శ్రావణి బాధపడుతోంది. ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తలుపులు పగలగొట్టి చూడగా విగత జీవిగా కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం తట్టుకోలేక..
ఇది ఇలావుంటే, మరో ఘటనలో తను ప్రేమించిన యువతికి మరొకరితో నిశ్చార్థమైందని మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ పట్టణంలోని మంగల్ పేటకు చెందిన చాకలి దుర్గయ్య.. రాపర్తి గ్రామానికి చెందిన ఓ యువతి ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఎంత చెప్పిన వినిపించుకోకపోవడంతోనే..
అయితే, ఆమె తల్లిదండ్రులు వేరే వ్యక్తితో ఆ యువతికి నిశ్చితార్థం ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న దుర్గయ్య ఆదివారం రాపర్తికి వెళ్లాడు. ప్రేమ విషయాన్ని యువతి తల్లిదండ్రులతోపాటు సొదరుడికి ఫోన్ ద్వారా చెప్పినా.. వారు వినిపించుకోలేదు. దీంతో ప్రేమించిన ప్రియురాలు తనకు దక్కకుండా పోతోందని వేదనకు గురైన దుర్గయ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, తమ కుమారుడిని యువతి కుటుంబసభ్యులే చంపి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడి తల్లిదండ్రులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.