ఆనాటి అసెంబ్లీ టైగర్.. విద్యాసాగర్ రావు రీ ఎంట్రీ..! కేసీఆర్కు చెక్ పెట్టడానికేనా?
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయా? గులాబీని ఢీకొట్టి కమలం పువ్వు వికసించబోతుందా? టీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కొని అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ పాగా వేయాలనుకుంటుందా? సీఎం కేసీఆర్కు ధీటుగా ఆనాటి అసెంబ్లీ టైగర్ను కాషాయం దండు తెరపైకి తేనుందా? తాజా పరిణామాలు చూస్తే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అవుననే సమాధానం కనిపిస్తోంది. మహారాష్ట్ర గవర్నర్గా చెన్నమనేని విద్యాసాగర్ రావు పదవీకాలం పొడిగించకుండా ఆయనను తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మార్చాలనేది ఢిల్లీ పెద్దల ఆలోచన అనే ప్రచారం జోరందుకుంది.

టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఏది?
ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ లేకుండా పోయింది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పోటీ ఇస్తుందని భావించినప్పటికీ.. దాని సంగతేంటో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. హస్తం గుర్తు మీద గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఇప్పటికే కారెక్కేశారు. దాంతో అసెంబ్లీలో కూడా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఆ క్రమంలో టీఆర్ఎస్కు అల్టర్నేట్ పార్టీ తమదే అంటూ బీజేపీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇప్పించే సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం చర్చానీయాంశమైంది.

టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఎదిగేనా?
2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన మొదలు తొలిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా క్షేత్రస్థాయిలో బలమైన శక్తిగా ఎదిగింది. ఇతర పార్టీల ఊసు లేకుండా చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పానికి తగ్గట్లుగానే ప్రజలు కూడా గులాబీ దండుకు పట్టం కడుతున్నారు. రెండోసారి కూడా 88 స్థానాలు గెలిచి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు ఎదురు లేకుండా పోయింది. అయితే ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఏకి పారేస్తున్నారు. అదే క్రమంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం జెండా రెపరెపలాడుతుందని పలు సందర్భాల్లో ఆ పార్టీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు.

లోక్సభ ఫలితాలు.. సభ్యత్వ నమోదు.. ఫుల్ జోష్
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలవడంతో ఢిల్లీ పెద్దల దృష్టి తెలంగాణపై పడింది. కొంచెం కష్టపడితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయొచ్చనేది వారి అంతరంగంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో ఇటీవల ఢిల్లీ బీజేపీ పెద్దలు తరచుగా రాష్ట్రానికి వస్తూ ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. తెలంగాణ గడ్డపై కాషాయం జెండా మరింత రెపరెపలాడాలని ఆశిస్తున్న హైకమాండ్.. చెన్నమనేని విద్యాసాగర్ రావును తిరిగి తెలంగాణ రాజకీయాల్లోకి తెచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. సీఎం కేసీఆర్కు చెక్ పెట్టాలంటే విద్యాసాగర్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించి పార్టీకి జవసత్వాలు నింపాలనేది వారి ప్లాన్గా కనిపిస్తోంది.

చెన్నమనేని ప్రస్థానం.. తిరిగి తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే..!
ఉమ్మడి రాష్ట్రంలో చెన్నమనేని విద్యాసాగర్ రావు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. 1980లో జనతా పార్టీ తరపున కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1985లో మెట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1989, 1994లో మరో రెండు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ప్రజా సమస్యలపై గళమెత్తి అసెంబ్లీ టైగర్గా ముద్రపడ్డారు. 1998లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. 1999లో మరోసారి గెలుపొంది వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004, 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి కేసీఆర్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2009లో వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి తన అన్న కొడుకైన చెన్నమనేని రమేశ్ బాబు చేతిలో ఓడిపోయారు. ఇక అక్కడి నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరమైన విద్యాసాగర్ రావు ఆ తర్వాత కాలంలో మహారాష్ట్ర గవర్నర్గా నియమితులై ఇప్పటికీ కొనసాగుతున్నారు.

కల్వకుంట్ల కుటుంబానికి చెన్నమనేని ఫ్యామిలీ దగ్గరేనా?.. మరి ఏవిధంగా చెక్?
మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్న విద్యాసాగర్ రావు పదవీకాలం పొడిగించలేదని తెలుస్తోంది. ఆయన్ని తెలంగాణ రాజకీయాల్లోకి తిరిగి తెచ్చేందుకే పదవీకాలం పొడిగించలేదనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ఆనాటి అసెంబ్లీ టైగర్ మరోసారి తెలంగాణ రాజకీయాల్లో రాణించనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని బలోపేతం చేసే దిశగా విద్యాసాగర్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అదలావుంటే కల్వకుంట్ల కుటుంబానికి చెన్నమనేని ఫ్యామిలీ దగ్గరే కదా.. మరి ఆయన కేసీఆర్కు ఎలా చెక్ పెడతారనే వాదనలు లేకపోలేదు. ఏది ఏమైనా ఆయన గనక మరోసారి తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే బీజేపీ బలం పుంజుకుంటుందని గట్టిగా చెబుతున్నారు మరికొందరు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications