అటు ప్రభుత్వం.. ఇటు టీఎస్ఆర్టీసి..!మద్యలో జీహెచ్ఎంసీ..! ఆర్టీసీ సమ్మెలో ఎన్ని మలుపులో..!!
హైదరాబాద్: ఆర్టీసి కార్మికుల సమ్మె రకరకాల మలపులు తిరుగుతోంది. ప్రభుత్వ అధికారులతో చర్చలు విఫలం, విపక్ష పార్టీల సంఘీభావం, రోజుకో నిరసన రూపంలో ఆర్టీసి ఉద్యోగుల కార్యాచరణ, ఆగని కార్మికుల మరణాలు, కోర్టు తవ్వి తీస్తున్న కీలక అంశాలతో తెలంగాణ రాష్ట్రంలో వాడి వేడి వాతావరణం చోటుచేసుకుంది. ఇక ఇదే సమ్మె అంశంలో తెలంగాణ హైకోర్ట్ జోక్యంతో ఆసక్తికర పరిణామాలు వెలుగు చూస్తున్నాయి.
బస్సుల సంఖ్య, నిధులు, రవాణా సంస్ధకు ప్రభుత్వం ఎంత చెల్లింపులు చేసింది, ఇంకెంత చేయాల్సి ఉంది, ఉద్యోగుల జీత బత్యాలు, జీహెచ్ఎంసీ ఎలాంటి ఒప్పందం చేసుకుంది, ఎన్ని నిధులు వెచ్చించింది అనే అంశాల పట్ల కీలక చర్చ జరుగుతోంది. అసలు ప్రభుత్వంలో ఆర్టీసిని విలీనం చేయాలనే అంశం పట్ల ఎక్కడా కూడా పెద్దగా చర్చ జరగకపోవడం విశేషం. ఇలాంటి పరిణామాల మధ్యలో ఆర్టీసి కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం ఉద్రిక్తంగా మారింది.
TSRTC Strike: ఆర్టీసీ కార్మికుడి నుంచి అద్దె తీసుకోనంటూ ఇంటి యజమాని, ప్రశంసలు
ఆర్టీసి ఇన్ ఛార్జ్ ఎండి నివేదిక తప్పుల తడక..! మండిపడ్డ హైకోర్ట్..!!
ఇక ఆర్టీసి అంశంలో ప్రభుత్వం కొన్ని వాస్తవాలను తొక్కి పెడుతుందనే అభిప్రాయాన్ని తెలంగాణ హైకోర్ట్ వ్యక్తం చోస్తోంది. కోర్టులకు నివేదిక సమర్పించే సమయంలో పూర్తి వివరాలు కాకుండా సగం సగం వివరాలు పొందపర్చడం పై ఆర్టీసీ ఇన్ ఛార్జీ ఎం.డి సునీల్ శర్మ పై హైకోర్టు మండి పడింది. ఆర్టీసీ యజమాన్యం అందజేసిన నివేదికపై న్యాయస్ధానం అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ అధికారులు తప్పుడు సమాచారం కోర్టుకు ఇస్తున్నారని పేర్కొంది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపు గా నివేదికలో ఎలా పేర్కొంటారని హైకోర్టు ప్రశ్నించింది. రాయితీల బకాయిలు డీజిల్, జీతాల చెల్లింపు ఇతర అవసరాల కోసం వాడామని ఆర్టీసీ యజమాన్యం కోర్టుకు చెప్పుకొచ్చింది.
బాకాయిల పట్ల స్పష్టత ఏదీ..! ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన న్యాయస్ధానం..!!
ఇదిలా ఉండగా జిహెచ్ఎంసీ ఆర్టీసీకి డబ్బులు చెల్లించాలా లేదా అనేది తేల్చాలని హైకోర్టు స్పష్టం చేసింది. 2018 -19 సంవత్సరానికి జీహెచ్ఎంసీ నుండి ఆర్టీసీకి రావాల్సిన నిధులు గురించి ఆ సంస్థకు తెలియజేశారా అని సునీల్ శర్మ ను ప్రశ్నించింది. ఐతే సునీల్ శర్మ కోర్ట్ కు సమాధానం చెప్పలేకపోయారు. ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ సమర్పించిన నివేదిక అంతా తప్పుడు లెక్కలతో ఉందని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఆర్టీసీ సమ్మె పై కేసును నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వ నివేదిక పారదర్శకంగా లేదని మాత్రం కోర్ట్ స్పష్టం చేసింది.
జీహెచ్ఎంసీ ఎందుకు చేతులెత్తేసింది..! వివరాలు కావాలన్న ధర్మాసనం..!!
శుక్రవారం హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ తరపున ఇన్ ఛార్జీ ఎం.డి సునీల్ శర్మ, ఈడీ టీవీ. రావు, ఆర్థిక సలహాదారు రమేష్ హాజరయ్యారు. సంస్థ ఆర్ధిక స్థితిగతులపై ఆర్టీసీ యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము 644.51 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా, మొత్తం సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్లో బస్సులు నడుపుతున్నందుకు 1786.06 కోట్ల రూపాయలు చెల్లించాలని జీహెచ్ఎంసీకి ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. 2015-16, 2016-17లో కలిపి రెండేళ్లలో జీహెచ్ఎంసీ 336.40 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది.
సమ్మె స్వరూపం మారుతోంది..! మూలాలను కదిలిస్తున్న తెలంగాణ హైకోర్ట్..!!
జీహెచ్ఎంసీ చట్టం, సెక్షన్ 112(30) ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్ఎంసీ అంగీకరించలేదు. అందువల్ల జీహెచ్ఎంసీ నుంచి రావాల్సినవి బకాయిలుగా పరిగణించరాదు. 2017 లో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగోకపోవచ్చు, కానీ ఇప్పుడు బాగానే ఉందని చెప్పింది. 2016 -17 సంత్సరానికి జీహెచ్ఎంసీ నుండి ఆర్టీసీ కి 246 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ అప్పుడు జీహచ్ఎంసీ దగ్గర నిధులు లేవని ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ దగ్గర నిధులు లేవా అని కోర్ట్ ప్రశ్నించింది. ఆర్టీసీలో నిర్వహణ, డీజిల్ భారం ఎక్కువగా ఉంటోందని, నిర్వహణ వ్యయం వల్లే నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వ సాయం అందుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని యాజమాన్యం హైకోర్టు కు తెలియచేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్ట్ సమయం మించి పోవడంతో ఈనెల ఏడుకి విచారణను వాయిదా వేసింది.