గ్రేటర్లో మెగా వ్యాక్సినేషన్.. 40 వేల మందికి టీకా, స్తంభించిన ట్రాఫిక్..
కరోనాకు టీకాతోనే చెక్ పెట్టాలి. వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఇవాళ హైటెక్స్లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. హైటెక్స్ వేదికగా ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి డ్రైవ్ చేపట్టింది. అయితే మెడికవర్ అధికారిక వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకున్న వారికే టీకా అందజేస్తున్నారు.
హైటెక్స్లో 30 హాళ్లలో 300 టేబుళ్ల వద్ద టీకా కార్యక్రమం కొనసాగుతుంది. వ్యాక్సిన్ కోసం జనం నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే 40 వేల మంది ఒకేచోటకు రావడం అంటే మాములు విషయం కాదు కదా.. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెలవు రోజు ఆదివారం అయినప్పటికీ ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యాక్సినేషన్ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇవాళ 40 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం వీకెండ్ కావడంతో వేలాదిమంది వ్యాక్సినేషన్ కోసం తరలి వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయిందని.. ఒకేసారి 50 వేల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు. మిగతావారికి కూడా వ్యాక్సిన్ గురించి అవగాహన వస్తుంది.
వాస్తవానికి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ మిగతావారికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికే చాలా మంది టీకాల కోసం చూస్తుండగా.. ఒకేసారి వేల సంఖ్యలో రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇతరులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి కనబరుస్తారనడంలో సందేహాం లేదు. టీకా తీసుకుంటే దాదాపుగా ఆరు నెలల వరకు ఢోకా ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఆ లోపు కరెక్టయిన టీకా వచ్చిందంటే చాలు.. కరోనాకు పూర్తిగా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.