నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులివే
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. నైట్ కర్ఫ్యూ అమలు కానున్న నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసు వేళల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకకటన విడుదల చేసింది.
హైదరాబాద్ నగరంలోని టెర్నిల్ మెట్రో స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 7.45 గంటలకు ఉంటుందని, అవి గమ్యస్థానాలకు రాత్రి 8.45 గంటల్లోపు చేరుకుంటాయని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం ఎప్పటిలాగే 6.30 గంటలకు తిరిగి సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.
మెట్రో రైలు ప్రయాణికులు కరోనా నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి సహకరించాలని హైదరాబాద్ మెట్రో రైల్వే కోరింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోవాలని సూచించింది.
కాగా, కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నేటి నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు ప్రతి రోజూ రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ కొద్ది వారాలుగా కరోనా కేసులు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా 5వేల మార్క్ని చేరాయి. ఆదివారం(ఏప్రిల్ 18) రాత్రి 8గం. నుంచి సోమవారం రాత్రి 8గం. వరకు 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1856కి చేరింది. ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,16,650కి చేరింది.