ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు తేడా తెలియదా..? కిషన్ రెడ్డిపై కేటీఆర్ గరం..గరం..
టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. ఏ విషయం అయినా సరే రెండు పార్టీల నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మంత్రి కేటీఆర్ కూడా అలానే స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక నిధులపై కిషన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ నిధుల గణాంకాల పేరుతో కిషన్ రెడ్డి అయోమయానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
విపత్తులతో పనిలేకుండా ఎస్డీఆర్ఎఫ్ నిధులు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ ఈ నిధులను కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చిందని కిషన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్డీఆర్ఎఫ్ కు, ఎస్డీఆర్ఎఫ్ కు తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఓ హక్కుగా లభిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు ఇస్తున్నదేంటో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. గుజరాత్ లో వరదలు వస్తే ప్రధానమంత్రి వెంటనే సర్వే చేపట్టి రూ.1000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక అదనపు సాయాన్ని అందించారని, మరి, తెలంగాణ ప్రజల కష్టాలు మోదీకి కనిపించవా? అని ప్రశ్నించారు.
నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలకు రూ.15,270 కోట్లు ఇచ్చారని, తెలంగాణకు ఇవ్వడానికి మాత్రం మనసొప్పడం లేదని కేటీఆర్ విమర్శించారు. 2018 తర్వాత తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటనను కిషన్ రెడ్డి చదవాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి పదవీలో ఉండి.. ఇలా మాట్లాడటం సరికాదని సూచించారు.