శ్రీనివాస్ గౌడ్ హత్యా ప్రయత్నం: నిందితులు పోలీసు కస్టడీ.. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసిన తెలిసిందే. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. వారికి మేడ్చల్ కోర్టు 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. నిందితులను న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఆదేశించింది. విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ కేసులో పోలీసులు మహబూబ్ నగర్కు చెందిన రాఘవేంద్రరాజును, ఆయన సోదరులను, ఇతరులను అరెస్ట్ చేశారు. మంత్రి వేధింపులను భరించలేకే హత్యకు కుట్ర పన్నామని వారు వెల్లడించినట్టు కథనాలు వచ్చాయి.
హత్యా ప్రయత్నంతో మంత్రికి భద్రతను మరింత పెంచారు. భద్రత పెంచుతున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. శ్రీనివాస్ గౌడ్ కు 20 మంది పోలీసులు, 10 మంది సిటీ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది, ఆరుగురు ఇంటెలిజెన్స్ అధికారులు, నలుగురు గ్రేహౌండ్స్ కమాండోలతో భద్రత కల్పిస్తారు. సీఎం కేసీఆర్ తర్వాత శ్రీనివాస్ గౌడ్ మాత్రమే గ్రేహౌండ్స్ కమాండోల భద్రత తీసుకుంటారు. శ్రీనివాస్ గౌడ్ భద్రతా బృందంలో గల పోలీసులకు ఎం44 ఆయుధాలు అందిస్తారు. మంత్రి కాన్వాయ్లోకి అదనంగా మరో రెండు వాహనాలను పెంచారు.
Recommended Video
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యా ప్రయత్నంలో రాఘవేంద్రరాజు స్టేట్ మెంట్లో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. శ్రీనివాస్ గౌడ్తో తనకు ప్రాణ హానీ ఉందని.. అందుకే తాను చంపాలని అనుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు కాదు 2017 నుంచి తనను చంపేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేశారని వెల్లడించారు. వేధింపులు తట్టుకోలేకే శ్రీనివాస్ గౌడ్ను చంపాలని అనుకున్నానని తెలిపారు. అంతేకాదు తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. శ్రీనివాస్ గౌడ్ తనపై 30 కేసులు పెట్టించారని, తన బార్ షాప్ను మూసివేయించి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఆర్థికంగా నష్టం చేయించడమే కాకుండా ఒక్కరోజే 10 కేసులు పెట్టించారని ఆరోపించారు. తనకు రూ. 6 కోట్లు నష్టం చేయించారని స్టేట్ మెంట్ లో రాఘవేంద్రరాజు వెల్లడించినట్లు సమాచారం. అదీ తట్టుకోలేక ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నారు. హత్య కోసం సుపారీ గ్యాంగ్ను ఆయన సంప్రదించారు.