15 నెలల తర్వాత హైదరాబాద్ ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభం: పాస్ ఉన్నవారికి గుడ్న్యూస్
హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభమయ్యాయి. దాదాపు 15 నెలల తర్వాత నగరంలో ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభయ్యాయి. గత సంవత్సరం మార్చి 23 నుంచి ఎంఎంటీఎస్ సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే.
విద్యార్థుల ఎంఎంటీఎస్ పాస్లు పొడిగింపు
ప్రస్తుతం 10 రైళ్ల సేవలు ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రతి రోజు ఉదయం 7.50 గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. విద్యార్థుల పాస్లు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్లలో కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గత ఏడాది ఎంఎంటీఎస్ పాస్లు చెల్లుబాటు..
ప్రయాణికుల రద్దీని బట్టి క్రమంగా సర్వీసులు పెంచుతామని తెలిపారు. ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. మార్చి 23, 2020 నాటికి సీజనల్ టికెట్లు తీసుకున్నవారు ఆ రోజు నాటికి ఎన్ని రోజులు నష్టపోయారో, తిరిగి వాటిని కలిసివచ్చే విధంగా పాత సీజనల్ టికెట్ పాసులు చెల్లుబాటు అవుతాయని తెలిపారు. వాటిని ఎంఎంటీఎస్ టికెట్ కేంద్రాల వద్ద సంప్రదించి రెన్యూవల్ చేసుకోవాలని కోరారు.
క్యాష్లెస్ టికెట్తో బోనస్
కరోనా కారణంగా వీలైనంత వరకు ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణం చేసేవారు క్యాష్ లెస్ టికెట్ పొందేవిధంగా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎంఎంటీఎస్ టికెట్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్ ఉపయోగించుకున్నవారికి 3 శాతం, యూటీఎస్ మొబైల్ యాప్లో ఆర్-వాలెట్ను టికెట్ కోసం వినియోగించుకున్నవారికి 5 శాతం చొప్పున బోనస్ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎంఎంటీఎస్ కంటే ముందు సేవుల ప్రారంభించిన మెట్రో..
ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభం కావడం పట్ల చిరుద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంఎంటీఎస్ సేవలు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభం కావడం తమలాంటి వారికి ఎంతో ఊరటనిచ్చిందంటున్నారు.కాగా, 2003 ఆగస్టు నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 29 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తున్నాయి. 2014-15 కిలోమీటర్ల మేర సికింద్రాబాద్-ఫలక్నుమా మధ్య సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 26 రైల్వే స్టేషన్లలో ఎంఎంటీఎస్ రైళ్లు సేవలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ మెట్రో సేవలు కూడా తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన నేపథ్యంలో సేవలు ప్రారంభించాయి. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ కూడా పెరిగింది. లాక్డౌన్ విధించిన నాటి నుంచి తెలంగాణలో కరోనా కేసులు తగ్గిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం పూర్తిగా లాక్డౌన్ ఎత్తేయడంతో జనసంచారం భారీగా పెరిగింది. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మరోసారి తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.