ఏకగ్రీవంలో ఇంత కథ ఉందా?.. 10 లక్షల బేరం.. కాంగ్రెస్ అభ్యర్థి క్యాష్ ప్రూఫ్
హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీ పంట పండింది. 2,130 సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. తాజాగా పరిషత్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవం కోసం పావులు కదుపుతోంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ క్రమంలో తొలివిడత ఎన్నికల్లో భాగంగా 2 జడ్పీ స్థానాలను, 28 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుని బోణీ కొట్టింది. అయితే అంతవరకు కథ బాగానే నడిచినా.. ఒక ఎంపీటీసీ స్థానం మాత్రం వివాదస్పదంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి రివర్స్ గేర్ వేయడంతో డామిట్ కథ అడ్డం తిరిగింది.

అదే జోరు.. ఏకగ్రీవం తీరు
పరిషత్ ఎలక్షన్లలో భాగంగా తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఆదివారం నాటితో ముగిసింది. దాంతో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా 2 జడ్పీటీసీ స్థానాలు, 28 ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ కు మంచి బోణీ తగిలినట్లైంది. ఎంపీటీసీ స్థానాలు అత్యధిక ఏకగ్రీవాలు నమోదైంది ఇక్కడే. మొదటి దశలో 45 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 10 స్థానాలు గులాబీ ఖాతాలో పడ్డాయి.

గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానం రచ్చ రచ్చ
పరిషత్ ఎన్నికల వేళ తొలివిడత పలుచోట్ల ఏకగ్రీవం కావడం.. అంతలోనే ఓ ఎంపీటీసీ స్థానం వివాదస్పదం కావడం చర్చానీయాంశమైంది. నాగర్కర్నూల్ జిల్లాలోని గగ్గలపల్లి స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఆదివారం నాటితో నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ కావడంతో కొందరు పోటీ నుంచి తప్పుకున్నారు. అదలావుంటే పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు చర్చానీయాంశంగా మారాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు వెంకట్ రెడ్డి. పోటీ నుంచి తప్పుకునేలా తనను బెదిరించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పోటీ నుంచి తప్పుకోకుంటే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.

10 లక్షలు తీసుకో.. లేదంటే..!
కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ రెడ్డి ఆరోపణలు జిల్లాలో చర్చానీయాంశంగా మారాయి. నామినేషన్ ఉపసంహరించుకున్నందుకు గాను తనకు టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చారని చెబుతున్నారు. ఆ డబ్బులను సైతం కలెక్టరేట్ కు తీసుకెళ్లి డీఆర్వోకి చూపించడం గమనార్హం.
గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం ప్రక్రియ సవ్యంగా సాగిందనుకుంటున్న తరుణంలో వెంకట్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం హాట్ టాపికయింది. టీఆర్ఎస్ నేతల బెదిరింపులతోనే తాను పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారట. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications