హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో మరో ముందడుగు.. స్టాప్ లైన్ కూడా సిగ్నలే.. (వీడియో)
Recommended Video
హైదరాబాద్ : మూడు రంగుల లైట్లతో చౌరస్తాలో కనిపించే ఓ స్తంభం.. ట్రాఫిక్ సిగ్నల్ అంటే ఇప్పటి వరకు అందరికీ గుర్తొచ్చేది ఇదే. కానీ త్వరలోనే ఇది మారబోతోంది. సిగ్నల్ లైట్లు స్తంభం పై నుంచి దిగి నేలపైకి రానున్నాయి. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎల్ఈడీ స్టాప్ లైన్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. వాహనదారులతో పాటు పాదచారులకు ఉపయోగపడేలా ఈ సరికొత్త ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను కేబీఆర్ పార్క్ వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
అదిక ఫీజులు వసూలు చేసే కాలేజీలకు సుప్రీం కోర్ట్ చెక్..!ఇంజనీరింగ్ విద్యార్థులకు ఊరట..!!
స్పష్టంగా సిగ్నల్ లైన్
కొత్త విధానంలో సిగ్నల్కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే డ్రైవింగ్ చేసే వ్యక్తికి సిగ్నల్ కనిపించేలా డిజిటల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో సిగ్నల్ లైన్ జంప్ చేయకుండా ఉండేందుకు ఈ ఎల్ఈడీ లైట్లు అమర్చారు.ఈ విధానంలో సిగ్నల్ మారినప్పుడల్లా రోడ్డుపై సిగ్నల్ లైన్లో కూడా లైట్ల రంగు మారుతుంది. దీంతో కూడళ్లు కొత్త అందాన్ని సంతరించుకోవడంతో పాటు వాహనదారులకు సిగ్నల్ స్పష్టంగా కనిపించనుంది.
చెన్నై కంపెనీ సహకారంతో
చెన్నై కు చెందిన అనలాగ్ అండ్ డిజిటల్ ల్యాబ్ కొత్త సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించింది. వారి సహకారంతో ల్యాండ్ ఎల్ఈడీ స్టాప్ సిగ్నలింగ్కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ విధానంలో రోడ్డుపై ఉండే స్టాప్ లైన్ సిగ్నల్ ప్రధాన సిగ్నల్లతో అనుసంధానమై ఉంటుంది. దీంతో పోల్పై ఏ సిగ్నల్ పడితే రోడ్డుపై అమర్చిన అదే ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. దాని ఆధారంగా వాహనాలు నిలపడం ముందుకు కదలడం జరుగుతుంది.
తొలగనున్న పాదచారుల ఇబ్బందులు
హైదరాబాద్ మహానగరంలో ప్రధాన రోడ్లన్నీ నిత్యం వేలాది వాహనాలతో కిటకిటలాడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులు స్టాప్ లైన్ దాటి జీబ్రా క్రాసింగ్పై వెహికిల్స్ నిలుపుతున్నారు. దీంతో పాదచారులు సిగ్నల్ చూస్తూ రోడ్డు దాటేలోపు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలకు కూడా సరికొత్త ట్రాఫిక్ సిగ్నలింగ్ టెక్నాలజీ పరిష్కారం చూపుతుందని అధికారులు అంటున్నారు.
ఉల్లంఘనులను గుర్తిస్తుందా?
గతంలో రాత్రి సమయాల్లో ప్రమాదాలు నివారించేందుకు డివైడర్లు రోడ్లుకు ఇరువైపులా చిన్న చిన్న లైట్లు అమర్చారు. ఈ లైట్లు సోలార్ ఎనర్జీని గ్రహించి పనిచేసేవి. అయితే ఈ విధానాన్ని కాలక్రమంలో పక్కన బెట్టారు. ఇదిలా ఉంటే కొత్త సిగ్నలింగ్ వ్యవస్థలో ఏర్పాటు చేసిన లైట్లు ట్రాఫిక్ ఉల్లంఘనులను గుర్తిస్తుందా అన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఎల్ఈడీ లైట్లను జంప్ చేస్తే అది ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలో నమోదై చలానాలు విధిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారులు మాత్రం అలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదని అంటున్నారు. భవిష్యత్తులో అలాంటి వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు.