భీమా కోరేగావ్ కేసులో ఎన్ఐఏ: వరవర రావు ఇద్దరు అల్లుళ్ల సమన్లు: ఇఫ్లూ ప్రొఫెసర్..
హైదరాబాద్: భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన విప్లవ రచయిత వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు సమన్లను జారీ చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160, 91 కింద వారికి సమన్లను జారీ చేసింది. విచారణ కోసం బుధవారం ముంబైలోని తమ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించింది. వరవర రావు అల్లుళ్లు కే సత్యనారాయణ ప్రస్తుతం ఇఫ్లూలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. మరో అల్లుడు కేవీ కూర్మనాథ్ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో డిప్యూటీ ఎడిటర్ హోదాలో ఉన్నారు.
Recommended Video
వారిద్దరికీ ఎన్ఐఏ తాజాగా సమన్లను జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉండటం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే కారణంతో రెండేళ్ల కిందట వరవర రావును ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని తలోజా కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదే సమయంలో కరోనా వైరస్ బారినా పడ్డారు. దీనితో మూడు వారాల వరకు వరవర రావు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో మళ్లీ జైలుకు తరలించారు.

వరవర రావును విడుదల చేయాలంటూ తిరుపతికి చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. ఆయన వయస్సును దృష్టిలో ఉంచుకుని, మానవతా దృక్పథంతో వరవర రావును విడుదల చేయాలంటూ భూమన విజ్ఙప్తి చేశారు. అంతకుముందు- బెయిల్ కోసం వరవర రావు కుటుంబ సభ్యులు ముంబై హైకోర్టునూ ఆశ్రయించారు. కొందరు సామాజిక కార్యకర్తలు కూడా బెయిల్ కోసం పిటీషన్లను దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ లభించలేదు.
భీమా కోరేగావ్ కేసులో పుణె పోలీసులు 2018 ఆగస్టులో వరవరరావును అరెస్టు చేశారు. ఆ సమయంలో ప్రొఫెసర్ కే సత్యనారాయణ నివాసాల్లో సోదాలు చేపట్టారు. అప్పట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. తాజాగా మరోసారి ఇద్దరు అల్లుళ్లకు సమన్లను జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
భీమా కోరేగావ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రొఫెసర్ కే సత్యనారాయణ ఇదివరకే వెల్లడించారు. వరవర రావుతో బంధుత్వం మాత్రమే ఉందని, అంతే తప్ప.. ఆయన కార్యకలాపాలతో తమకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. ఇందులో తమను భాగం చేయడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications