అదేంటి ఓల్డ్ సిటీలో లాక్ డౌన్ లేదా..? పెళ్లా..? ఇంతమంది గెస్టులా.. నెటిజన్ల ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే బయట తిరిగే అవకాశం.. ఆ తర్వాత కనిపించాలంటే పాస్ తప్పనిసరి. అయితే పాతబస్తీలో మాత్రం లాక్ డౌన్ లేనట్టే అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న సాయంత్రం గ్రాండ్గా పెళ్లి జరిగింది. చాలా మంది పాల్గొన్నారు. మాస్క్ లేదు, సోషల్ డిస్టన్స్ లేదు.. హోం మంత్రి రావడంతో పోలీసులే భద్రత కల్పించారు. దీనిపై జనం గుర్రుమీదున్నారు. ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
పర్ప్యూమ్ ఓనర్ కూతురి పెళ్లి
పాతబస్తీలో దుబ్బె పెర్ఫ్యూమ్ ఓనర్ కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. లాక్ డౌన్ సమయంలో టపాసులు పేలుస్తూ.. హడల్ ఎత్తించారు. కనీసం సోషల్ డిస్టెన్స్, లాక్ డౌన్ రూల్స్ పట్టించుకోకుండా వివాహ వేడుక జరిగింది. కమటి పుర పీఎస్ పరిధిలోని సవేర ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్ళికి వందలాది మంది హాజరయ్యారు. వీరిలో వీవీఐపీ, వీఐపీలు, రాజకీయ నాయకులు ఉన్నారు. దగ్గరుండి మరీ పెళ్లికి సౌత్ జోన్ పోలీసులు సెక్యురిటీ కల్పించారు. సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగిన పెళ్లి వేడుకలకు హోమ్ మంత్రి మహుమద్ అలీ కూడా హాజరయ్యారు.
ఫోటోలు తీసి పోస్ట్..
ఫోటోలు తీసి పోస్ట్ చేయడంతో చర్చకు దారితీసింది. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదేంటి అక్కడ లాక్ డౌన్ లేదా అని అడుగుతున్నారు. కరోనా సెకండ్ వేవ్లో మరీ ఇంతలా ప్రవర్తించడం సరికాదంటున్నారు. సామాన్య జనం రోడ్లపైకి వస్తే.. ఆంక్షలు విధిస్తారు. మరీ ఈ పెళ్లి సంగతేంటి అని అడిగారు. దీనిపై మీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కేటీఆర్కు ట్వీట్
ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీఆర్, హైదరాబాద్ సీపీలకు ఎంబీటీ ప్రెసిడెంట్ అంజదుల్లాఖాన్ ట్విట్ చేశారు. సవేర ఫంక్షన్ హాల్లో ఏం జరుగుతోంది? లాక్ డౌన్ సమయంలో ఇంత మంది జనాలు ఎందుకు పోగయ్యారు? లాక్డౌన్ సమయంలో రోడ్డు ఎక్కితేనే వాహనాలు సీజ్ చేస్తున్నారు. మరి ఇన్ని వాహనాలు ఎక్కడ నుండి వచ్చాయి? హైదరాబాద్ పాతబస్తీలో లాక్ డౌన్ రూల్స్ పాటించట్లేదా? సవేర ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లిపై ఎవరి పై చర్యలు తీసుకుంటారు? దగ్గరుండి సెక్యురిటి ఇచ్చిన పోలీసుల పైనా లేక పెళ్లి జరిపించిన దుబ్బే కుటుంబ పైనా?'' అని ట్వీట్ చేశారు.
పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు
అంజదుల్లాఖాన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు పోలీసులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ ఘటనతో పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.