తిరిగి పార్టీలోకి తీసుకోవద్దు, ఎమ్మెల్యేగా పోటీ చేయించొద్దు.. రాజా సింగ్ ఇష్యూపై వీహెచ్
మహ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. వెంటనే బీజేపీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ అంశంపై మిగతా పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు రియాక్ట్ అయ్యారు. రాజా సింగ్ను తిరిగి పార్టీలోకి తీసుకోవద్దని సూచించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా చూడాలని కోరారు. అలా అయితేనే మిగతా వారు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని వీహెచ్ అభిప్రాయపడ్డారు. రాజా సింగే కాదు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కూడా ఇలానే కామెంట్స్ చేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటకుండా చూసే బాధ్యత కేసీఆర్దేనని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు గీత దాటితే.. అనర్హత వేటు వేయాలని కోరారు. అలా అయితే భయం, భక్తి ఉంటుందని పేర్కొన్నారు.
నిన్న కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరిగింది. కానీ తనకు ఆహ్వానం రాలేదని వీహెచ్ తెలిపారు. పిలవని పేరంటానికి వెళ్లలేదని చెప్పారు. సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక గురించి ఇంచార్జీ, పీసీసీ మాట్లాడాలని సూచించారు. తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మునుగోడులో ప్రచారానికి వెళతామని తెలిపారు.
ఇటీవల హైదరాబాద్కు మునావర్ ఫరూఖీ వచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ కూడా ఆ షోకు హాజరయ్యారు. షో నిర్వహించొద్దని రాజా సింగ్ విన్నవించారు. అయినా షో నిర్వహించడంతో వీడియో పోస్ట్ చేశారు. అందులో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా కామెంట్స్ ఉన్నాయట. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆ వర్గం నుంచి నిరసనలు వచ్చాయి.