సీఎం వ్యాఖ్యలతో అట్టుడుకుతున్న తెలంగాణ..! కేసీఆర్ పై మండిపడ్డ ప్రతిపక్ష నేతలు..!!
హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఆర్టీసి ఉద్యోగుల గురించి, సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల గురించి మాట్లాడిన తీరును ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. చంద్రశేఖర్ రావు నియంతలా వ్యవరిస్తున్నారని, ఒక ముఖ్యమంత్రి స్దాయిలో మాట్లాడాల్సిన మాటలు కాదిని విమర్శిస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత సీఎం చంద్రశేఖర్ రావు ఆర్టీసి ఉద్యోగుల పట్ల నిరంకుశ వ్యాఖ్యలు చేసారని మండిపడుతున్నారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, ఆర్టీసి కార్మికుల సహకారంతో తెలంగాణ సాధించి, ఇప్పుడు ఆర్టీసి ని నిషేదిస్తామని చెప్పడం చంద్రశేఖర్ రావుకు తగదని తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు యల్ రమణ మండిపడ్డారు. రమణతో పాటు విపక్షనేతలందరూ చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలను ఖండించారు.
సీఎం స్థాయి తగ్గి మాట్లాడుతున్నాడు.. ఆర్టీసిని నిషేదించే హక్కు సీఎంకు లేదన్న అశ్వత్థామరెడ్డి..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నాడని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ వి. అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులను రెచ్చగొట్టే విధంగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రాజకీయాల్లో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తే ఆర్టీసి లో రెండేళ్లకు ఒకసారి వస్తాయన్నారు. ఏపీ సీఎం జగన్ పై వ్యగ్యాంగా మాట్లాడుతున్నారని, చంద్రశేఖర్ రావు ఎజెండా వేరు, జగన్ ఎజెండా వేరన్నారు. చంద్రశేఖర్ రావు ఏపీఎస్ ఆర్టీసీ పై ఇష్టానుసారంగా మాట్లాడిన తరువాత జగన్ విలీనం పై జీఓ జారీ చేశారన్నారు.
హుజూర్ నగర్ లో గెలిస్తే పండుగ కాదు.. తర్వాత చుక్కలు చూపిస్తామన్న కిషన్ రెడ్డి...
బీజేపీ నేత కిషన్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై విరుచుకు పడ్డారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదంటూ పలువురు టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఒక్క హుజూర్ నగర్ సీటు గెలిచినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదన్నారు. ఇల్లు అలకగానే పండుగ అంటే ఎలా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టే పనులు సీఎం చంద్రశేఖర్ రావు మానుకోవాలని సూచించారు. కార్మికుల పొట్టగొట్టి కేసీఆర్ ప్రభుత్వం నడుపుతున్నారు. సామరస్యంగా పరిష్కరించాల్సిన ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేంద్రం మీద మోపడం ఏంటని ప్రశ్నించారు. కార్మికులతో చర్చలు జరిపి పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందన్నారు కిషన్ రెడ్డి.
రాష్ట్రానికి ముక్యమంత్రా.. లేక గల్లీ నాయకుడా..? మండిపడ్డ కోదండరామ్..
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీరును టీజేఎస్ అధినేత కోదండరామ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. వీధి నాయకుడి తరహాలో ముఖ్యమంత్రి మాట్లడారని.. ఇది దురదృష్టకరమన్నారు. ప్రశ్నలు అడిగే మీడియా వారిని దబాయించారు కాని సమాధానం చెప్పలేదన్నారు. అసత్యాలు అర్దసత్యలే మాట్లాడారన్నారు. ఆర్టీసీకి చట్టప్రకారం ఇచ్చేదానికంటే చాలా తక్కువ ఇచ్చారన్నారు. పేదవారి రవాణాకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమం వదిలిలేసి ప్రైవేటు సంస్థ యజమానిలా మాట్లాడారని ఎద్దేవా చేశారు. దీనిపై గ్రామాలకు వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తాంమన్నారు. ఆర్టీసీ లేకపోతే వచ్చే నష్టాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
కేసీఆర్ మాటల్లో అహంభావం కొట్టొచ్చినట్టుంది.. సీఎం భాష మార్చుకోవాలన్న భట్టి..
చంద్రశేఖర్ రావు మాట్లాడిన తీరు ప్రజాస్వామ్య వాదుల్ని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆశ్చర్యపరిచిందన్నారు. చంద్రశేఖర్ రావు మాటల్లో అహంభావం కొట్టొచ్చినట్టు కనిపించిందని చెప్పారు. ఆర్టీసీపై చంద్రశేఖర్ రావు నిజస్వరూపం బయటపడిందని తెలిపారు. కోర్టు తీర్పును కూడా చంద్రశేఖర్ రావు వక్రీకరించారని ధ్వజమెత్తారు. కార్మికుల బాధలు పనికిమాలినవిగా కనిపించాయా?, ఫ్యూడల్ మనస్తత్వం గల వారికి అలాగే ఉంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని చంద్రశేఖర్ రావు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ పరంచేస్తే ఎవరూ హర్షించరన్నారు. ఆర్టీసీ చంద్రశేఖర్ రావు జాగీర్ కాదు అని షబ్బీర్ అలీ అన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ పై ఎందుకు సమీక్షలు చేయలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అమెరికా, ఇంగ్లాండ్ లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాస్ లోనే ఉందని తెలిపారు. అరేండ్లు పడుకుని ఇప్పుడు మూసేస్తా అంటే చూస్తూ ఊరుకోమన్నారు షబ్బీర్.