హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులుగా ఓవైసీ బ్రదర్స్ ఒక్కరు కాదు .. ఇద్దరు కాదు .. ముగ్గురు.. ! క్యాబాత్ హై
హైదరాబాద్ : ఓవైసీ బ్రదర్స్ కు ఏమైంది? భాగ్యనగరాన్ని కంచుకోటగా మార్చుకున్నోళ్లకు ఇప్పుడు విజయంపై నమ్మకం సన్నగిల్లిందా? హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి అక్బరుద్దీన్ నామినేషన్ వేయడమేంటి? అసలు ఓవైసీ బ్రదర్స్ ప్లానేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా?
ఎంఐఎం ఇలాకా.. మరి ఇప్పుడేమైంది?
హైదరాబాద్ లో పాగా వేసింది ఎంఐఎం. ఏళ్లకు ఏళ్లుగా భాగ్యనగరాన్ని కంచుకోటలా మార్చుకున్న ఓవైసీ బ్రదర్స్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా కనపడని ఆ పార్టీ హవా.. హైదరాబాద్ లో మాత్రం దండిగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోని 7 సెగ్మెంట్లను తమ ఖాతాలో వేసుకుంటుందంటే.. ఎంఐఎం బలమేంటో అర్థం చేసుకోవచ్చు. అన్న అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా.. తమ్ముడు అక్బరుద్దీన్ చాంద్రాయణ గుట్ట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2004, 2009, 2014లో హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి ఎంఐఎం తరపున పోటీచేసి గెలుపొందారు అసదుద్దీన్. ఈసారి కూడా అదే స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అనూహ్యంగా ఆయన సోదరుడు, చాంద్రాయణ గుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. హైదరాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ.. రెండు ప్లాన్లు (A,B) అమలు చేస్తుందని అసదుద్దీన్ క్యాడర్ కు చెప్పడం గమనార్హం.
అందుకేనా తమ్ముడి నామినేషన్?
హైదరాబాద్ లోక్సభ స్థానానికి అన్న అసదుద్దీన్ నామినేషన్ వేసిన మరుసటి రోజే.. తమ్ముడు అక్బరుద్దీన్ అదే స్థానానికి నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అందులో వివాదమేమీ లేదన్నది పార్టీ నేతల మాట. ఒకవేళ సాంకేతిక కారణాలతో అసదుద్దీన్ నామినేషన్ తిరస్కరణకు గురైతే.. అక్బరుద్దీన్ లైన్ లో ఉంటారని చెబుతున్నారు.
గతంలో ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అని.. ఈసారి ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించబోతుందన్న కారణంగా ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారనేది మరో వాదన. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 7 స్థానాల్లో బ్యాకప్ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. అయితే హైదరాబాద్ లోక్సభ స్థానానికి అసదుద్దీన్ నామినేషన్ ఆమోదం పొందిన మరుక్షణమే అక్బరుద్దీన్ తన నామినేషన్ వాపస్ తీసుకుంటారట.
సఖ్యత లేదా? పక్కా వ్యూహామా?
మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాకుత్ పుర ఎన్నికల సభలో మాట్లాడుతూ తనకు ఇవే చివరి ఎన్నికలు కావొచ్చని ప్రసంగించారు. గతంలో తనపై జరిగిన దాడితో ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. తన కోసం ఆలోచించి ఏనాడూ ఎన్నికల్లో పోటీచేయలేదని.. కేవలం తన కమ్యూనిటీకి సేవ చేయాలనే లక్ష్యంతోనే ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు. తన స్థానంలో కమ్యూనిటీకి సేవ చేయాలని ఎవరైనా ముందుకొస్తే తప్పుకుంటానని చెప్పారు.
అయితే హైదరాబాద్ పార్లమెంటరీ స్థానానికి అక్బరుద్దీన్ నామినేషన్ వేశారని తెలియగానే ఎన్నో రకాల ఊహాగానాలు జోరందుకున్నాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత దెబ్బతిందేమోననే మాటలు వినిపించాయి. అదలావుంటే అసదుద్దీన్ నామినేషన్ కు టెక్నికల్ గా సమస్యలు ఏవైనా తలెత్తితే బ్యాకప్ గా ఉండటానికి మాత్రమే అక్బరుద్దీన్ నామినేషన్ వేశారనేది పార్టీశ్రేణుల మాట.
కారు జోరును తగ్గించేందుకు జాతీయ పార్టీల కసరత్తు..! కాంగ్రెస్, బీజేపి ల వ్యూహం ఏంటి..?
ఛోటా భాయ్ బుర్హాన్ కూడానా?
అసదుద్దీన్ చోటా బ్రదర్ బుర్హాన్ కూడా ఈసారి హైదరాబాద్ స్థానం నుంచి నామినేషన్ వేస్తారనే ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో ఆయన నామినేషన్ వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయట. ఓవైసీ బ్రదర్స్ లో నెంబర్ 1, నెంబర్ 2 కాకపోతే చివరకు బుర్హాన్ ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ లపై మత వివాదాలకు సంబంధించి కేసులున్న కారణంగా ఆ ఇద్దరి నామినేషన్లు ఒకవేళ తిరస్కరణకు గురయ్యే అవకాశముంటే.. బుర్హాన్ బరిలో నిలుస్తారన్నమాట. ముందస్తు జాగ్రత్తనో, పకడ్బందీ వ్యూహామో ఏమోగానీ.. మొత్తానికి ఓవైసీ బ్రదర్స్ ఈసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హాట్ టాపికయింది.
అదలావుంటే హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎం ప్రస్థానాన్ని దేశవ్యాప్తం చేసేందుకు ఓవైసీ బ్రదర్స్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో అక్బరుద్దీన్ మహారాష్ట్ర నుంచి లోక్ సభ బరిలో నిలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నాందేడ్ నుంచి గానీ లేదంటే ఔరంగాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసే ఛాన్సున్నట్లు సమాచారం. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఇవే చివరి ఎలక్షన్లంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించడం.. ఇప్పుడేమో హైదరాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేయడం.. అటు మహారాష్ట్ర వైపు కన్నేయడం.. ఇదంతా కూడా ఎంఐఎం ఎలక్షన్ స్ట్రాటజీలో భాగమేనంటున్నారు పొలిటికల్ అనాలిస్టులు.