ఆక్సిజన్ కొరత, బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్ సూచన
కరోనా కోరలు చాచింది. రోజుకు కేసులు పెరగడం కాదు.. ప్రభావం కూడా ఉంటుంది. రెండు, మూడు రోజుల్లో వైరస్ తెలియడం కాదు.. చనిపోతున్నారు కూడా... ఇదీ శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు. అయితే ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. దాదాపు అన్నీ చోట్ల బెడ్లు నిండిపోయాయి. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత కూడా అధికంగా ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా అంగీకరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వాస్తవమేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గతంలో కంటే కరోనా వేగంగా వ్యాపిస్తోందని... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ఈటల ప్రారంభించారు. 25 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ను కోరామని ఈటల తెలిపారు. తమ అభ్యర్థనపై ఆయన సానుకూలంగా స్పందించారని... అయితే, ఎలాంటి హామీ మాత్రం ఇవ్వలేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కానీ, నైట్ కర్ఫ్యూ కానీ ఇప్పట్లో విధించే అవకాశం లేదని తెలిపారు. నైట్ కర్ఫ్యూ గురించి వార్తలు వచ్చిన క్రమంలో ఈటల స్పందించారు. కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని... అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను పదే పదే కోరారు.