ఓయూలో కలకలం: హాస్టల్ గదిలో విగత జీవిగా పీహెచ్డీ విద్యార్థి
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం ఓ విద్యార్థి మృతి కలకలం రేపింది. పీహెచ్డీ చేస్తున్న ఓ యువకుడు యూనివర్సిటీ హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
జాగ్రఫీ పీహెచ్డీ స్కాలర్ నరసయ్య(44) సోమవారం మధ్యాహ్నం యమునా హాస్టల్ రూం నెంబర్ 3లో విగతజీవిగా పడివుండటాన్ని గమనించిన తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటన్ హాస్టల్ వద్దకు చేరుకున్న పోలీసులు.. నరసయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ప్రిన్సిపాల్ ప్రతాప్ రెడ్డిని అడిగి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. నరసయ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
కాగా, నరసయ్య మృతితో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అతడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 2లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని రిజిస్ట్రార్ ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications