సింగర్ సిద్ శ్రీరామ్కు అవమానం... పబ్లో రెచ్చిపోయిన ఆకతాయిలు... నీళ్లు,మద్యం విసిరేసి...
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న ఓ పబ్లో సింగర్ సిద్ శ్రీరామ్కు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నం.10సిలో ఉన్న సన్బర్న్ సూపర్ క్లబ్కి ఆయన వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో కొంతమంది ఆకతాయిలు శ్రీరామ్పై నీళ్లు,మద్యం విసిరి అవమానించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సిద్ శ్రీరామ్... 'గెట్ అవుట్' అంటూ వాళ్లపై అరిచినట్లు సమాచారం.వెంటనే అక్కడున్న పబ్ యాజమాన్యం జోక్యం చేసుకుని గొడవ పెద్దది కాకుండా ఇరువురికి సర్దిచెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.
బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడ్డ యాజమాన్యం
ఇటీవల సన్బర్న్ సూపర్ క్లబ్లో సిద్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు.ఈ క్రమంలో ఓరోజు కొంతమంది ఆకతాయిలు సిద్ను టార్గెట్ చేసి అవమానించినట్లు కథనాలు వస్తున్నాయి. ఆ ఈవెంట్కు చాలామంది సెలబ్రిటీలు,ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో సిద్ శ్రీరామ్ ఈ గొడవను పోలీసుల దాకా తీసుకెళ్లకుండా పబ్ యాజమాన్యం ఆయనకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ శ్రీరామ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే అక్కడినుంచి వెనుదిరిగినట్లు సమాచారం.
సిద్ చేసిన ఆ ట్వీట్తో...
మార్చి 5న సిద్ శ్రీరామ్ చేసిన ఓ ట్వీట్ పబ్లో ఆయనకు అవమానం జరిగిందన్న కథనాలకు బలం చేకూర్చేలా ఉంది. 'ఎవరికీ భయపడాల్సిన అవసరం లేకుండా మైండ్ను కాస్త క్రమశిక్షణలో పెట్టుకోండి.' అని శ్రీరామ్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. తనను అవమానించిన ఆకతాయిలను ఉద్దేశించే సిద్ ఈ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై అటు పబ్ యాజమాన్యం గానీ ఇటు సిద్ గానీ ప్రత్యక్షంగా ఎక్కడా స్పందించలేదు. అయితే సిద్ శ్రీరామ్కు పబ్లో అవమానం ఎదురైందన్న వార్త తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.కాగా,గతంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కూడా ఓ పబ్లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ ఎమ్మెల్యే సన్నిహితులు,అనుచరులు కలిసి రాహుల్పై దాడి చేయడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఆ దాడిపై రాహుల్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
హిట్ సాంగ్స్తో దూసుకెళ్తున్న సిద్
తనదైన గాత్రంతో సిద్ శ్రీరామ్ అనతి కాలంలోనే మంచి సింగర్గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో సిద్ పాడిన పాటలు చాలావరకు సూపర్ హిట్ అయ్యాయి. గీతా గోవిందం,డియర్ కామ్రేడ్,ట్యాక్సీవాలా,అలవైకుంఠపురంతో పాటు ఇటీవలి వకీల్ సాబ్లోని 'మగువా మగువా' సాంగ్ చాలా పాపులర్ అయ్యాయి. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో రంగ్ దే సినిమా కోసం పాడిన 'నా కనులు ఎపుడు' కూడా ట్రెండింగ్లో ఉంది.