మంచు విష్ణుపై స్పందించిన ప్రకాష్ రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పనితీరుపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఏడాది క్రితం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లు హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విష్ణు విజయం సాధించి అధ్యక్షుడయ్యారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది మాత్రమే అయిందని, ఆయన పనిచేశారా? లేదా? అనేది సభ్యులకు తెలుస్తుందన్నారు. ఎన్నికైన వాళ్లకు పనిచేసే బాధ్యత కూడా ఉంటుందని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇటీవల 'మా' కోసం చేసిన పనులను ప్రకటించారు కదా! అని అడగ్గా 90శాతం పనులు చేశామని ప్రకటించడం వల్ల ఆ పనులు చేసినట్లు కాదని, విష్ణు పదవీకాలంలో ఇంకో సంవత్సరం ఉందని, 'మా' కోసం ఏం చేస్తారో చూద్దామని ప్రకాష్ రాజ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పందించాలని కోరగా 'ఇంకా సమయం ఉంది. ఆలోచిస్తాను' అంటూ బదులిచ్చారు.
గతేడాది జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రకాశ్రాజ్, మంచు విష్ణులు అధ్యక్ష పదవికి హోరాహోరీగా తలపడ్డారు. హోరాహోరీగా సాగిన ప్రచారం, అనూహ్య మలుపులు.. చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సాధారణ ఎన్నికలను మించి జరిగాయి. చివరకు విష్ణు విజయం సాధించి, 'మా' అధ్యక్షుడయ్యారు. ఇటీవల మంచు విష్ణు మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్ని పురస్కరించుకుని ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చామని ప్రకటించారు. నటులకు సినిమాల్లో అవకాశాలు కల్పించడం, వారికి పింఛన్లు, వైద్య సేవలు, మహిళల సంరక్షణ, మాకు సంబంధించి నూతన సభ్యత్వాల విషయంలో తీసుకున్న నిర్ణయాలను విష్ణు వివరించారు. వ్యక్తిగతంగా తానిచ్చిన 'మా' భవనం హామీపై కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.