కరోనా: 20 రోజులు ట్రీట్మెంట్.. రూ.29లక్షలు వసూలు...చివరకు మృతదేహం అప్పగింత..
ఆమె నిండు గర్భిణి... ఇటీవలే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవించింది. ఆ తర్వాత రెండు రోజులకే ఆమెకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే ఆ రిపోర్టులేవీ చూపించలేదు. మెడికల్ రిపోర్టులన్నీ గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. దాదాపు 20 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచారు. ఆమె భర్త వైద్యులను ఎప్పుడు అడిగినా.. పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పేవారు. కానీ అకస్మాత్తుగా గురువారం(సెప్టెంబర్ 3) ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. అప్పటికే రూ.29లక్షలు వైద్యం కోసం ఖర్చు చేసిన భర్త... ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. అంతా గోప్యంగా ఉంచుతూ చివరకు మృతదేహాన్ని అప్పగించడంపై అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అసలేం జరిగింది...
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం బల్సురుగొండకు చెందిన శ్వేతారెడ్డికి ఇటీవల గ్రూపు-2లో ఏసీటీవోగా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే విధులు నిర్వర్తిస్తున్న ఆమె నిండు గర్భంతో ఉన్నారు. ఈ క్రమంలో జులై 27న స్వల్ప జ్వరం రావడంతో.. ఆమె భర్త మహబూబ్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అయినప్పటికీ జ్వరం తగ్గలేదు. అగస్టు 3న డెలివరీ కోసం మహబూబ్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే శ్వేతారెడ్డికి జ్వరం,దగ్గు ఉన్నందునా కరోనా టెస్టులు చేయించుకోవాలని అక్కడి వైద్యులు సూచించారు.
హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిక..
వైద్యుల సూచన మేరకు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా నెగటివ్గా తేలింది. అయినప్పటికీ స్థానికంగా ఏ ఆస్పత్రి ఆమెను చేర్చుకోకపోవడంతో అగస్టు 4న డెలివరీ కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ మొదట రూ.2లక్షలు చెల్లిస్తేనే సిజేరియన్ చేస్తామని చెప్పారు. దీంతో మాధవరెడ్డి అడిగినంత డబ్బు చెల్లించారు. అక్కడ శ్వేతారెడ్డి మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ తర్వాత రెండు రోజులకు ఆమెకు కొద్దిగా ఆయాసం కావడంతో.. అనుమానంతో కరోనా పరీక్షలు చేశారు.
రిపోర్టులు చూపించకుండానే...
కోవిడ్ 19 టెస్టులకు సంబంధించిన రిపోర్టులు చూపించకుండానే పాజిటివ్ వచ్చిందని మాధవరెడ్డితో చెప్పారు. దీంతో ఎలాగైనా సరే తన భార్యను బతికించాలని మాధవరెడ్డి వైద్యులతో చెప్పారు. అగస్టు 12న ఆమె ఐసీయూలో చేర్చారు. దాదాపు 20 రోజుల పాటు అందులోనే ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో రూ.29లక్షలు ఫీజు వసూలు చేశారు. మాధవరెడ్డి ఎప్పుడు ఆరా తీసినా శ్వేతారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పేవారు.అయితే ఆమెకు అందిస్తున్న ట్రీట్మెంట్ గురించి ఏ వివరాలు చెప్పేవారు కాదు.
Recommended Video
చివరకు మృతదేహం అప్పగింత...
తన భార్యను చూపించాలని మాధవరెడ్డి బాగా ఒత్తిడి తేవడంతో.. ఒకరోజు పీపీఈ కిట్ ఇచ్చి ఐసీయూలోకి అనుమతించారు. అక్కడ తన భార్య పరిస్థితి చూసి షాక్ తిన్నాడు. ఆమె కళ్లతో చూడటం తప్పితే మనుషులను గుర్తించే స్థితిలో లేదు. దీంతో తన భార్య మెడికల్ రిపోర్టులు ఇవ్వాలని... వేరే వైద్యులను సంప్రదిస్తామని మాధవరెడ్డి పట్టుబట్టారు. అయితే వైద్యులు అందుకు నిరాకరించారు. తీరా గురువారం(సెప్టెంబర్ 3) తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు మాధవరెడ్డికి చెప్పారు.భారీ ఫీజులు వసూలు చేసి... కనీసం మెడికల్ రిపోర్టులు కూడా చూపించకుండా.. చివరకు తన భార్యను బలితీసుకున్నారని మాధవరెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ ఆస్పత్రిపై హైదరాబాద్ డీఎంహెచ్ఓకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.