క్యూ"నెట్" లో సెలబ్రిటీలు.. నటీనటులు, క్రికెటర్లకు మల్టీ లెవెల్ ఉచ్చు
హైదరాబాద్ : ప్రకటనలతో లక్షలు కోట్లు సంపాదిస్తారు నటీనటులు, క్రికెటర్లు. వాళ్లకేంటి.. ఒక్క యాడ్ లో నటిస్తే బోలెడు డబ్బులు వస్తాయని అనుకుంటాము. కానీ చాలా సందర్భాల్లో సీన్ రివర్సవుతోంది. ప్రకటనల్లో కనిపించి డబ్బులు తీసుకోవడం ఏమో గానీ బ్రాండ్ అంబాసిడర్ల బ్యాండ్ మోగుతోంది. తాజాగా క్యూనెట్ మల్టీ లెవెల్ కంపెనీ మోసాల తాలూకు పలువురు నటీనటులు, క్రికెటర్లు తాఖీదులు అందుకున్నారు.
మల్టీ లెవెల్ మోసం.. బ్రాండ్ అంబాసిడర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. నటీనటులకు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. సదరు కంపెనీ మాయాజాలంతో వారు నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. యాడ్ లో నటించమని తమ దగ్గరకొచ్చే కంపెనీల పనితీరు చూడకుండా సెలబ్రిటీలు అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటి పరిస్థితులకు దారితీస్తోంది.
క్యూ'నెట్' లో సెలబ్రిటీలు
మల్టీ లెవెల్ మార్కెటింగ్ తో జనాలకు కుచ్చుటోపి పెట్టిన క్యూనెట్ సంస్థ కేసులో సెలబ్రిటీలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ కంపెనీ ఛీటింగ్ కేసులో నటీనటులతో పాటు క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. బాలీవుడ్ కు చెందిన షారూక్ ఖాన్, పూజా హెగ్డే, బొమన్ ఇరానీతో పాటు టాలీవుడ్ కు చెందిన అల్లు శిరీష్ కు నోటీసులు ఇచ్చారు. అటు క్రికెటర్ యువరాజ్ సింగ్ కు కూడా తాఖీదులు పంపించారు. వారం రోజుల్లో విచారణకు హాజరుకవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యాడ్స్ లో నటించినందుకే..!
సైబరాబాద్ పోలీసుల నోటీసులు అందుకున్న ఈ సెలబ్రిటీలు క్యూనెట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. ప్రచారంలో భాగంగా ఆ కంపెనీ రూపొందించిన యాడ్స్ లో నటించారు. అయితే క్యూనెట్ సంస్థను నమ్మి తాము పెట్టుబడులు పెట్టామని, తీరా సదరు కంపెనీ మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో పోలీసులను ఆశ్రయించడంతో క్యూనెట్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ తో జనాల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన క్యూనెట్ ఛీటింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కొందరు బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదుచేసిన సైబరాబాద్ పోలీసులు.. ఈ సంస్థతో సంబంధమున్న సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు.
క్యూనెట్ కథ ఇది
మల్టీలెవెల్ మార్కెటింగ్ తో మాయాజాలం చేసిన క్యూనెట్ సంస్థ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి కుచ్చుటోపి పెట్టింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంగా భావిస్తున్న క్యూనెట్ మోసాలు అన్నీ ఇన్నీ కావు. దీనికి సంబంధించి 14 కేసులు నమోదు కాగా 58 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 1998లో హాంకాంగ్ కేంద్రంగా క్యూవన్ గ్రూపును స్థాపించారు జోసఫ్ బిస్మార్క్, విజయ్ ఈశ్వరన్. అయితే అందులో నష్టాలు రావడంతో దాన్ని మూసివేశారు. 2001లో భారతదేశానికి వచ్చిన వీరిద్దరు గోల్డ్క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించారు. బంగారు కాయిన్ల పేరుతో బిజినెస్ చేశారు.
ఇద్దరే ఇద్దరు.. కోట్ల రూపాయల మోసం
వీరిద్దరే సూత్రధారులుగా సాగిన ప్రస్థానం.. ఎన్నో కంపెనీలు స్థాపించడానికి కారణమైంది. 2004లో క్వెస్ట్నెట్ ఎంటర్ప్రైజెస్ పేరుతో గోల్డ్ కాయిన్స్, హాలిడే ట్రిప్స్ వంటి కార్యకలాపాలతో చాలామందిని బురిడీ కొట్టించారు. దేశవిదేశాలకు వ్యాపారం విస్తరించి అమాయకుల నుంచి అందినకాడికి దండుకున్నారు. 2010లో కొన్ని ఆరోపణల నేపథ్యంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీరి కంపెనీలపై ఉక్కుపాదం మోపింది. విచారణకు ఆదేశించడంతో సదరు సంస్థల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే 2011లో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా పేరుతో మరో కంపెనీని ప్రారంభించి.. దానికి అనుబంధంగా క్యూనెట్ బ్రాండుతో బిజినెస్, ఎడ్యుకేషన్, హెల్త్, జ్యువెల్లరీ, విహార యాత్రలు తదితర అంశాల్లో ఆకర్షణీయమైన ప్యాకేజీలు తయారుచేసి ఛైన్ మార్కెటింగ్ తో జనాలను బోల్తా కొట్టించారు.
పిట్ట కథలు.. గొలుసుకట్టు
మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల్లో ఆరితేరిన జోసఫ్ బిస్మార్క్, విజయ్ ఈశ్వరన్.. నిరుద్యోగులే టార్గెట్ గా వ్యాపార కార్యకలాపాలు విస్తరించేవారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. ఇక నెలనెలా మీకు ఆదాయమే అంటూ ఊరిస్తారు. షార్ట్ పీరియడ్ లో మీరు కోటీశ్వరులు కావొచ్చంటూ మాయమాటలు చెబుతారు. అయితే దానికి కొంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుందంటూ నమ్మిస్తారు. ఇక లక్షలకొద్దీ రూపాయలు కట్టించుకుంటూ పిట్ట కథలు వల్లిస్తారు. ఏదో చెబుతూ, మరేదో చేస్తూ రెండు మూడు నెలలు వారిని వీరిచుట్టూ తిప్పించుకుంటారు. దాని తర్వాత అసలు కథ మొదలెడతారు. గొలుసుకట్టు మాయాజాలం నూరిపోస్తారు. బంధువులు, స్నేహితులను చేర్పిస్తూ సంస్థ ఉత్పత్తులు అమ్మితేనే మీకు కోట్లు వస్తాయంటూ మరో కహానీ వినిపిస్తారు. ఈ విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లక్షలాది మందిని మోసగించారు.