నిండుకుండలా ప్రాజెక్టులు.. జలకళను సంతరించుకున్న సాగర్, శ్రీశైలం
భారీ వర్షాలతో వరదనీరు వస్తోంది. ఎగువ నుంచి దిగువ గల ప్రాజెక్టుల్లోకి నీరు భారీగా వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 533.60 అడుగులకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు బ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1,05,230 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,03,990 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటిమట్టం 11.114 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
ఇటు శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 68,491 క్యూసెక్కులు వస్తుండటంతో..ఔట్ ఫ్లో 12,713 క్యూసెక్కులు కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 844.90 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 69.9025 టీఎంసీలు ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
Recommended Video
మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలో గల 30 గ్రామాలు ఉన్నాయి. గ్రామంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
రాత్రి నుంచి వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉదయం కూడా రెయిన్ కంటిన్యూ అవుతోంది. దీంతో వాగులు, వంకలు నిండుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా రహదారులపైకి భారీగా వర్షపునీరు వచ్చింది.