ఏక్నాథ్ షిండేలకు గాడ్ ఫాదర్ కేసీఆర్; దమ్ముంటే ముందస్తుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి సవాల్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ఏకపాత్రాభినయం చేశారని కెసిఆర్ ను దుర్యోధనుడు ఆవహించినట్లుగా ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక సోమవారం నాడు వర్షాలపై సమీక్ష తర్వాత సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బిజెపి లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు.

మోడీకి గురువే కేసీఆర్
నక్క ముసలిదయ్యాక నాన్ వెజ్ బంద్ చేసినట్టుగా కెసిఆర్ మాటలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లి నీతి కథలు చెప్పినట్టుగా కేసీఆర్ తీరు ఉందని రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని దిక్కుమాలిన మోడీతో పోల్చుతావా అంటూ మండిపడ్డ రేవంత్ రెడ్డి మోడీ క్రూరమైన నిర్ణయాలు అన్నింటిలోనూ కెసిఆర్ ప్రత్యక్ష పాత్ర ఉందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ కోటాలో కేసీఆర్ వాటా ఎంత అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్ చెప్పింది నిజమే అన్న రేవంత్ రెడ్డి మోడీ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందని, కానీ మోడీకి గురువు కెసిఆర్ అంటూ నిప్పులు చెరిగారు.

ఏకనాథ్ షిండే లకు కేసీఆర్ గాడ్ ఫాదర్
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కెసిఆర్ లాక్కున్నప్పుడు ఇవన్నీ మర్చిపోయారా అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏక్నాథ్ షిండే లను తయారు చేస్తుంది కెసిఆర్ కాదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కేసీఆర్ కు ఏకనాథ్ షిండేల భయం పట్టుకుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లంతా ఇతర పార్టీ నేతలని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఏక్నాథ్ షిండే లకు కెసిఆర్ గాడ్ ఫాదర్ అంటూ చురకలంటించారు.

కేసీఆర్ మోడీల మధ్య లొల్లి ఆకు రౌడీ , గల్లీ రౌడీ మధ్య లొల్లి లాంటిది
మోడీ కి కెసిఆర్ కు వాటాల తేడాతో లొల్లి మొదలైందని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఆకు రౌడీ గల్లీ రౌడీ ల లొల్లి వారిదని ఎద్దేవా చేశారు . మాట్లాడితే కేసీఆర్ గుణాత్మక మార్పు అంటున్నారని, ఆయన గుణమే గుడిసేటిదని మండిపడ్డారు. మోడీ కి కెసిఆర్ కి మధ్య నిజంగా సఖ్యత లేకపోతే కాంగ్రెస్ పెట్టిన 2 సి.బి.ఐ కేసులపై చార్జిషీట్ వేయకుండా ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అందరి మీద కేసులు పెడుతున్న మోడీ తెలంగాణా వరకు ఎందుకు రావడం లేదని, కెసిఆర్ మీద మోడీ ఈగ వాలకుండా చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

బీజేపీ చేసే ప్రతీ తప్పులోనూ టీఆర్ఎస్ ఉంది
మోడీ, కేసీఆర్ తోడుదొంగలు అంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దేశంలో సాగునీరు, తాగునీరు అందించింది కాంగ్రెస్ పార్టీ అని, అసలు కాంగ్రెస్ పార్టీ తో పోల్చే స్థాయి నరేంద్ర మోడీకి లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి చేస్తున్న ప్రతి ఒక్క తప్పిదం లోనూ కెసిఆర్ పాత్ర ఉందని, టిఆర్ఎస్ భాగస్వామ్యం ఉందని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇక కేసీఆర్ జాతీయ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కెసిఆర్ జాతీయ పార్టీ కాదు అంతర్జాతీయ పార్టీ పెట్టు, చంద్రమండలంలో పార్టీ పెట్టు, యమలోకంలో పార్టీ పెట్టు ఎవడు వద్దన్నాడు అంటూ సెటైర్లు వేశారు.

దమ్ముంటే నాలుగురోజుల్లో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళు కేసీఆర్
కేసీఆర్ కు దమ్ముంటే నాలుగు రోజుల్లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి 90 లక్షల ఓట్ల కంటే ఒక్క ఓటు తక్కువ పడినా తాను పేరు మార్చుకుంటాను అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో రాజపక్సే కుటుంబానికి పట్టిన గతి కేసీఆర్ ఫ్యామిలీకి పడుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సహారా కుంభకోణంలో కెసిఆర్ ని బిజెపి కాపాడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పిన రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లు మాత్రమే గెలుస్తుందని ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త కెసిఆర్ కు నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ భయపడుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications