ఘోర రోడ్డు ప్రమాదం: కారు-లారీ ఢీ, చిన్నారితోపాటు ఐదుగురు మృతి
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కారు, లారీ ఢీ..
ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా సంగాయిపేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్(40) దంపతుల కుమారుడు(6) అనారోగ్యానికి గురికావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఆ తర్వాత స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. చౌటుకూర్ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.

కారులోని ఐదుగురు అక్కడికక్కడే మృతి..
ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు. ప్రమాదంలో అందరూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ రమణ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. మరణించినవారి కుటుంబసబ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

ఇద్దరు పిల్లలను చంపిన తల్లి
ఇద్దరు కన్న బిడ్డలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది ఓ వివాహిత. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్కు చెందిన శివశంకర్ బ్యాంక్ ఉద్యోగి. ఆయనకు భార్య జ్యోత్స్నతోపాటు ఇద్దరు పిల్లలు రుద్రామ్స్(6), దేవాన్ష్(4) ఉన్నారు. గత కొంతకాలంగా వీరికి అనారోగ్యం ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వారిని చంపేందుకు తల్లి ప్రయత్నించింది. పారాసిటమాల్ మాత్రలు మింగించేందుకు ప్రయత్నించగా పిల్లలు ప్రతిఘటించారు. దీంతో వారిద్దరిని గొంతు నులిమి చంపేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు దగ్గరికి వెళ్లింది. అక్కడ్నుంచి భర్త శివశంకర్కు ఫోన్ చేసి చెరువులో దూకి చనిపోతున్నానని చెప్పింది. అక్కడ్నుంచే వీడియో తీసి పంపింది.

చెరువులో దూకుతున్నానంటూ భర్తకు ఫోన్..
కాగా, జ్యోత్స్న చెరువులో దూకిన విషయం గమనించిన మత్స్యకారులు ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఆలోపే పోలీసులు, ఆమె భర్త అక్కడకు చేరుకున్నారు. జ్యోత్స్నను పోలీసులు ఆమె భర్త శివశంకర్కు అప్పగించారు. తన భార్యను తీసుకుిన ఇంటికి వెళ్లిన శివశంకర్ పిల్లలు చనిపోయిన విషయం తెలుసుకున్నాడు. పిల్లలు విగతజీవులుగా పడివుండటాన్ని చూసి భోరన విలపించాడు శివశంకర్. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించాడు. వారిని చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని తెలిపింది. కొన్ని మాత్రలు మింగానని చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత కొంత కాలంగా పిల్లలు అనారోగ్య కారణాలతో బాధపడుతుండటంతో మానసిక వేదనకు గురైన తల్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లల మృతితో తండ్రి శివశంకర్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. అక్కడున్నవారిని ఈ దృశ్యాలు కదిలించాయి.












Click it and Unblock the Notifications