గురితప్పిన కేసీఆర్ డెడ్ లైన్ అస్త్రం! కోర్టు తీర్పు పైనే అందరి నేత్రం!
హైదరాబాద్ : చర్చలు, ఫలించని భేటీలు, సమ్మె నోటీసులు, ప్రభుత్వ హెచ్చరింపులు, ఉద్యోగుల తొలగింపు, ఏకమైన విపక్షాలు, ముఖ్యమంత్రి డెడ్ లైన్లు, పట్టించుకోని కార్మికులు, న్యాయస్థానానికి ఫైనాన్స్ సెక్రెటరీ క్షమాపణలు, సీఎం సుధీర్ఘ సమీక్షలు హైకోర్టు విచారణ... ఇవీ గత 33రోజులుగా తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులకు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న పరిణామాలు. ఆర్టీసి ఉద్యోగులు తలపెట్టిన సమ్మె రోజు రోజుకూ ఉధృతరూపం దాల్చడమే కాకుండా స్వయంగా సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశాలను కూడా పట్టించుకోలేదు. దీంతో గురువారం తెలంగాణ హైకోర్టులో జరగనున్న విచారణపై ప్రభుత్వ వర్గాలతో పాటు కార్మిక లోకంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
TSRTC STRIKE:హైకోర్టు విచారణ, ముగిసిన కార్మికుల గడువు, మిగతా రూట్లపై కేసీఆర్ సమీక్ష
33వ రోజుకు చేరుకున్న సమ్మె..! నేడు కోర్టులో కీలక విచారణ..!!
అంతే కాకుండా ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నిధుల చెల్లింపులకు సంబంధిచిన నివేదికలో కూడా వాస్తవాలు లేవని తేలడంతో ఫైనాన్స్ సెక్రెటరీ కోర్టుకు క్షమాపణలు తెలపడం కొసమెరుపు. అంతే కాకుండా హైకోర్టు గురువారం జరపనున్న విచారణపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. 33 రోజులగా సమ్మె చేస్తున్న కార్మికులకు కోర్టు అనుకూలంగా తీర్పు చెప్తుందా, లేక అమలు కాని డిమాండ్లతో ప్రజా రవాణా వ్యవస్ధను ఆర్టీసి ఉద్యోగులు నిర్వీర్యం చేసారన్న ప్రభుత్వ వాదనను కోర్టు సమర్థిస్తుందా అనే అంశం ఉత్కంఠగా మారింది.
సీఎం రెండు డెడ్ లైన్లు..! పట్టించుకోని కార్మికలోకం..!!
తెలంగాణలో అధికార పార్టీ నేతలే కాకుండా, కార్మికుల దృష్టి అంతా హైకోర్టు వేపే ఉన్నాయి. ఉద్యోగుల విషయంలో ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనే అంశం పట్ల అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ కార్మికులు 33 రోజలుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పైగా విధుల్లో చేరకుంటే ఉద్యోగాలు ఊడినట్టేనని సీఎం చంద్రశేఖర్ రావు రెండుసార్లు డెడ్లైన్లు విధించారు. అయినా, కార్మికులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. హైకోర్టు కూడా పలు సందర్బాల్లో ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎలాంటి మలుపు తిరగబోతోందన్న అంశం ఆసక్తి రేపుతోంది.
తప్పుల తడకగా ప్రభుత్వ ఆర్దిక నివేదిక..! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కోర్ట్..!!
ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని, కార్మికులను సమ్మె విరమించుకోవాలని ఆదేశించలేం అని ఇప్పటికే హైకోర్టు చెప్పింది. పైగా నిధుల విషయంలో తప్పుడు నివేదిక సమర్పించి కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ నిలదీసింది. వాస్తవాలతో ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఫైనాన్స్ సెక్రెటరీ హైకోర్టుకు క్షమాపణలు చెప్పడం సంచలనంగా మారింది. దీనిపై గురువారం హైకోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే, కోర్టు ఏం చెబుతుంది.. ప్రభుత్వం నివేదికలో ఏం చెబుతుంది. కార్మికుల అభిప్రాయం ఎలా ఉండబోతుందన్న విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కోర్టుకు రావాలని ఆదేశించింది.
ఆర్టీసి సంస్థకు, ప్రభుత్వానికి మధ్య చెల్లింపులు!
అంతే కాకుండా ఆర్టీసి సంస్థ ప్రభుత్వానికి బాకీ ఉందని కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి వేల కోట్ల రూపాయలు రావాలని, అవి చెల్లిస్తే ఆర్టీసీ నష్టాల్లోనుంచి లాభాల్లోకి వస్తుందని ఇప్పటిదాకా చర్చ జరిగింది. కానీ, ప్రభుత్వం ఈ విషయంలో ఒక్కసారిగా బాంబు పేల్చింది. తాము ఆర్టీసీకి ఏమీ బాకీ లేమని, రోడ్డు పన్నుల పేర ఆర్టీసీనే ప్రభుత్వానికి బాకీ ఉందని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి ముగింపు ఉంటుందోనన్న విషయం అందిరిలో ఆసక్తిగా మారింది. కోర్టు విచారణ పట్ల అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు కార్మిక లోకం ఉంత్కంఠగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.