సికింద్రాబాద్ విధ్వంసం కేసు: పిల్లల భవిష్యత్తుపై చంచల్గూడ జైలు వద్ద తల్లిదండ్రుల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టిన యువత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఊహించనివిధంగా విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసం కేసులో ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు, వారిని చంచల్గూడ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. వీరు విధ్వంసానికి పాల్పడినట్టు పూర్తి ఆధారాలను సేకరించామని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. నేర నిర్ధారణ అయితే వీరికి జీవిత ఖైదు పడే అవకాశం లేకపోలేదని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు.
చంచల్ గూడా జైలు వద్ద రైల్వేస్టేషన్ విధ్వంసం కేసు నిందితుల తల్లిదండ్రులు
ఇక దీంతో సోమవారం ఉదయం చంచల్ గూడా జైలుకు చేరుకున్న నిందితుల తల్లిదండ్రులు తమ పిల్లలతో ములాఖత్ లో కలవడానికి చంచల్గూడ జైలు వద్ద పడిగాపులు పడుతున్నారు. రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించిన కేసులో నిందితులుగా ఉన్న తమ పిల్లలకు ఏమవుతుందోనన్న ఆందోళనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధ్వంసంలో ఎలాంటి సంబంధం లేకపోయినా తమ పిల్లలను అరెస్ట్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ పిల్లలకు ఏ పాపం తెలీదని కన్నీరుమున్నీరు అవుతున్న తల్లిదండ్రులు
తమ పిల్లలకు ఏ పాపం తెలియదు అని జైలు సిబ్బంది వద్ద కన్నీటి పర్యంతం అవుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో దాదాపు రెండు వేల మందికి పైగా ఆందోళనకారులు పాల్గొన్నారు. ఇక వీరిలో సిసిటివి ఫుటేజీ ఆధారంగా 46 మందిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు, విధ్వంసానికి కారకులైన వారిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీరంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని రైల్వే ఎస్పీ పేర్కొన్నారు. అంతేకాదు రైల్వేస్టేషన్లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు.
కేసు నుండి తమ పిల్లలను తప్పించాలని వేడుకోలు
రైల్వే కేసులలో శిక్ష పడ్డ వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావని స్పష్టం చేశారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీలో జాబ్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని , ఈ కేసు నుంచి తమ పిల్లలను తప్పించాలని ప్రాధేయ పడుతున్నారు. కానీ కఠిన శిక్షలు పడే అవకాశం ఉండటంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
జూన్ 17న జరిగిన విధ్వంసకాండపై రైల్వే పోలీసులు సీరియస్
జూన్ 17 వ తేదీన జరిగిన విధ్వంసకాండలో ఆందోళనకారులు రైల్వే ప్లాట్ ఫామ్ లమీద ఉన్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్,దానాపూర్ ఎక్స్ ప్రెస్,అజంతా ఎక్స్ ప్రెస్ లబోగీలకు నిప్పు అంటించారు.మొత్తం నాలుగు బోగీలకు ఆందోళనకారులు నిప్పంటించారు అని,58 అద్దాలు పగలగొట్టారు అని అధికారులు చెబుతున్నారు. దీనిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. ఇక రైల్వే పోలీసులపై రాళ్లతో దాడి చేశారని, ఆందోళనకారులను అదుపులోకి తీసుకురావడానికి ఫైరింగ్ చేయక తప్పలేదని తెలిపారు. ఇక ఈ ఘటనలో రాకేష్ అనే ఓ ఆర్మీ అభ్యర్థి మృతిచెందడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైంది.