టీఆర్ఎస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు.. కేసీఆర్ కు భయం అందుకే: బండి సంజయ్ సంచలనం
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు రాజకీయంగా రోజులు దగ్గర పడ్డాయని, టీఆర్ఎస్లో ఎందరో ఏకనాథ్ షిండేలు ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ విమర్శించిన బండి సంజయ్, లక్ష కోట్లు మింగి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, జూరాల నెట్టెంపాడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ల సంగతి ఏమిటని ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీలో ఏక్ నాథ్ షిండే లు ఉన్నారు కాబట్టే తెలంగాణ సీఎం కేసీఆర్ కు టెన్షన్ పట్టుకుందని అందుకే గులాబీ అధినేత ప్రెస్ మీట్ లో వంద సార్లు ఏక్ నాథ్ షిండే జపం చేస్తున్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏం జరిగిందో కేసీఆర్కు ఎలా తెలుసు?
విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏం జరిగిందో సీఎం కేసీఆర్కు ఎలా తెలుసు అంటూ ప్రశ్నించారు. బీజేపీకి ఎలాంటి వ్యూహం లేదని చెబుతున్న మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అంటూ నిలదీశారు. బీజేపీకి వ్యూహం లేకపోతే 18 రాష్ట్రాల్లో ఎలా అధికారంలో ఉంటుంది చెప్పాలని ప్రశ్నించారు. సీఎం మాట్లాడుతున్న భాష చాలా సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు. జోగులాంబను అవమానించినందుకు, హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఏక్నాథ్ షిండేలు.. కేసీఆర్ కు భయం అందుకే
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ప్రస్తావిస్తూ, మీరు ఏక్నాథ్ షిండే గురించి మాట్లాడుతున్నారు, ముందు, మీ స్వంత పార్టీని చూసుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్లో చాలా మంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారని కెసిఆర్ ఏక్నాథ్ షిండే గురించి చాలాసార్లు ప్రస్తావించడం వెనుక కూడా అదే కారణం కావచ్చు అని అభిప్రాయపడ్డారు బండి సంజయ్. ఏక్నాథ్ షిండే లాంటి నాయకులు టిఆర్ఎస్ పార్టీలో ఎదుగుతున్నారని ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆయన కుటుంబంలోనే ఏక్నాథ్ షిండేలు ఉన్నారు కావచ్చు
టిఆర్ఎస్ పార్టీలో ఎవరైనా ఏకనాథ్ షిండే కావచ్చు, సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ కావచ్చు, కూతురు కవిత మేనల్లుడు హరీష్ రావు కూడా ఏక్నాథ్ షిండే లు కావచ్చు అంటూ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.వరదల సమయంలో ప్రజలను కలిసేందుకు కర్ణాటక సీఎం వెళుతున్నప్పటికీ కేసీఆర్ తన ఫామ్హౌస్ నుంచి బయటకు రాలేదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కర్ణాటక సీఎం పర్యటిస్తున్నారు. మీరు మీ ఫామ్హౌస్ నుండి బయటకు కూడా వచ్చారా? అని నిలదీశారు బండి సంజయ్.

మోడీని చూస్తేనే కేసీఆర్ కు భయం ..ఆయనది మేకపోతు గాంభీర్యం
ఇక మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్ కు జ్వరం వస్తుంది అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అని, ప్రధాని నరేంద్ర మోడీ వస్తే చాలు భయపడుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జోకర్ లాగా వ్యవహరిస్తున్నారంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న సీఎం కెసీఆర్ కు, గులాబీ పార్టీకి ప్రజలు త్వరలోనే బొంద పెడతారని ఘాటుగా వ్యాఖ్యానించారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications