షాకింగ్ .. ఆ మహిళా ఎమ్మెల్యే కన్నీళ్లు ... ఆనంద భాష్పాలా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి శుభ సూచకాలా ?
రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళా మంత్రికి కూడా స్థానం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అప్పటినుండి మంత్రివర్గ కూర్పులో ఈసారి మహిళలకు అవకాశం దొరుకుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత మంత్రివర్గంలోనూ మహిళలకు స్థానం ఇవ్వకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం పలు విమర్శలను ఎదుర్కొంది. దీంతో ఈ మంత్రి వర్గ విస్తరణలో తప్పకుండా మహిళలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరగడం మహిళా నేతల్లో సంతోషాన్ని నింపింది. ఇక రేసులో ముగ్గురు మహిళలు పోటాపోటీగా తలపడ్డారు. అయితే అసలు మహిళలు రేసులోనే లేరని తేల్చేశారు సీఎం కేసీఆర్. దీంతో రాజ్ భవన్ వేదికగా జరిగిన నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కన్నీటిపర్యంతమయ్యారు నిన్నటి వరకు మంత్రిగా అవకాశం వస్తుందని చెప్పుకున్న సదరు మహిళా ఎమ్మెల్యే.
మంత్రి పదవి రాక కన్నీటిపర్యంతమైన మహిళా ఎమ్మెల్యే
మంత్రివర్గ విస్తరణ జరిగింది. రాజ్ భవన్ వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆ మహిళా ఎమ్మెల్యే మాత్రం కంటికి కడివెడు దుఃఖించారు. మహిళల్లో ఆమె సీనియర్ కావడంతో మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే ఆమెకు ఈ మంత్రివర్గ విస్తరణలో నిరాశ ఎదురైంది. దీంతో రాజ్ భవన్ సాక్షిగా ఆ మహిళా ఎమ్మెల్యే కన్నీటిపర్యంతమయ్యారు. ఆమెను ఓదార్చడానికి పలువురు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. ముఖంపై ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే సదరు మహిళా ఎమ్మెల్యే వాడిన ముఖంతో, ఏమాత్రం చిరునవ్వు లేకుండా కనిపించారు. ఒకపక్క ప్రమాణస్వీకారం జరుగుతుంటే మరోపక్క ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోగానే బాధతో నిండిన హృదయంతో బయటకు వెళ్లిపోయారు సదరు మహిళా ఎమ్మెల్యే.
మహిళా ఎమ్మెల్యే కన్నీటిపై గులాబీ నేతల అవాక్కయ్యే స్పందన
మహిళా ఎమ్మెల్యే కన్నీటిపర్యంతమైన విషయంలో టిఆర్ఎస్ నేతల స్పందన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ టివి చర్చాకార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ నేతలు ఆ మహిళా ఎమ్మెల్యే కన్నీరు ఆనంద భాష్పాలు ఏమో అంటూ మాట్లాడడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మంత్రి పదవి వస్తుందని ఆశించి, పదవి రాక నిరాశకు గురైన మహిళా ఎమ్మెల్యే ఇతరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎందుకు ఆనందబాష్పాలు రాలుస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎవరైనా తమకు అవకాశం వచ్చినప్పుడు సంతోషంతో ఆనందభాష్పాలకు ఆస్కారం ఉంటుంది కానీ, అవకాశం రాకుంటే ఆనంద భాష్పాలు వస్తాయని సదరు టిఆర్ఎస్ నేతలు చెప్పడం హాస్యాస్పదమే.
ఆ మహిళా ఎమ్మెల్యే కన్నీళ్లు.... టీఆర్ఎస్ నేతలకు ఆనందభాష్పాలట
మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మహిళలను ఘోరంగా అవమానిస్తే, ఇక మంత్రి గా అవకాశాలు రాక ఆవేదన చెందిన మహిళా ఎమ్మెల్యే కన్నీళ్లు ఆనంద భాష్పాలు అంటూ టిఆర్ఎస్ పార్టీ లోని పురుష పుంగవులు చెప్పడం మరింత దారుణం. రాజకీయాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ముందుకు నడుస్తున్న మహిళలకు మంత్రివర్గంలో సమాన అవకాశాలు కల్పించకపోవడం నిజంగా శోచనీయం. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మంత్రులుగా మహిళలకు స్థానం కల్పించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క మహిళకు మంత్రిగా అవకాశం దక్కలేదు.
మహిళా ఎమ్మెల్యే కంటతడి.. కేసీఆర్ క్యాబినెట్ కు శుభ సూచకమా
మగవాళ్లతో సమానంగా ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్థంగా చేయగలిగిన శక్తి మహిళలకు ఉంది అయినా సీఎం కేసీఆర్ తన కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించకపోవడం మహిళలపై ఆయనకున్న అపనమ్మకమే అనే అనుమానం కూడా కలుగుతోంది. క్యాబినెట్ విస్తరణ సమయంలో కన్నీరొలికిన ఓ మహిళా ఎమ్మెల్యే ఆవేదన ఇందుకు సాక్షి. అంతా శుభమే జరగాలంటూ ముహూర్తాలు చూసుకొని మరీ కేసీఆర్ చేసిన మంత్రివర్గ విస్తరణలో ఓ మహిళా ఎమ్మెల్యే కంటతడిపెట్టడం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం శుభసూచకం. రాజకీయాల్లో మహిళలపై చిన్నచూపు ఉంది అని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తుందని మహిళలందరి అభిప్రాయం. ఇప్పటికైనా భవిష్యత్తులో జరగనున్న క్యాబినెట్ విస్తరణ లో అయినా సీఎం కేసీఆర్ మహిళలకు స్థానం కల్పించకపోతే కచ్చితంగా మహిళల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది