షాకింగ్: ఆడాళ్ళ మోజులో భర్త... నన్నే పట్టించుకోవా అంటూ సలసలకాగే నూనె పోసిన భార్య!!
హైదరాబాద్: ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటూ పెళ్లి చేసుకున్న భర్త, తనను తన పిల్లలను పట్టించుకోవడంలేదని ఆగ్రహించిన ఒక భార్య కోపంతో భర్తపై సలసల కాగే వేడి నూనె పోసింది. ఇంట్లో కట్టుకున్న భార్య ఉండగా, తనను కాదని పరాయి స్త్రీల వ్యామోహంలో భర్త ఉంటున్నాడని ఆరోపిస్తున్న భార్య, భర్త పై తీవ్ర అసహనంతో ఈ దారుణానికి ఒడిగట్టింది.

భర్త వివాహేతర సంబంధాలు .. భార్య అసహనం
హైదరాబాద్ లో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే విజయవాడ సింగ్ నగర్ కు చెందిన 50 సంవత్సరాల గిరిధర్ లాల్ , 40 సంవత్సరాల రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. విజయవాడలో మాంసపు దుకాణం నిర్వహించే గిరిధర్ లాల్ పిల్లల చదువుల నిమిత్తం మూడున్నరేళ్ల కిందట హైదరాబాద్ కి వచ్చాడు. జియాగూడ లోని మాంసం దుకాణంలో పనిచేస్తూ గుడిమల్కాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే అక్కడి నుంచి పది రోజుల క్రితమే దరియాబాగ్ కు మకాం మార్చాడు. గత కొంతకాలంగా భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త వేరే మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను నిర్లక్ష్యం చేస్తున్నారని భార్య పదేపదే భర్త పై ఆరోపణలు గుప్పిస్తోంది.

భర్తపై సలసలకాగే వేడినూనె పోసిన భార్య
ఈ క్రమంలోనే గత ఐదు నెలలుగా ఓ మహిళ వద్ద ఉంటూ, మూడు రోజుల క్రితమే తన వద్దకు వచ్చాడు అని భార్య పిల్లలను మరిచి బాధ్యతారాహిత్యంగా ఉంటున్నాడని ఆరోపిస్తున్న భార్య, భర్త తీరును సహించలేక సలసల కాగే వేడి నూనె పోసింది. ఆడోళ్ళ మోజులో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ, వాళ్ల దగ్గరే ఉంటూ జల్సాలు చేస్తున్నాడని, ఇంట్లో ఉండే తనను, పిల్లలను పట్టించుకోవడంలేదని భార్య ఆరోపిస్తుంది.

నిద్రపోతున్న భర్తపై భార్య దారుణం.. తీవ్రగాయాల పాలైన భర్త ఆస్పత్రిలో
ఇదే విషయంలో అనేక మార్లు భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయని పేర్కొన్న భార్య భర్త తీరు తట్టుకోలేక ఇంట్లో నిద్రపోతున్న సమయంలో, పొయ్యి మీద నూనె పెట్టి బాగా మరిగించి భర్త తలపై పోసింది. ఇక ఈ ఘటనతో గిరిధర్ తల, ఛాతీ, చేతులు బాగా కాలిపోయాయి. ఇక గిరిధర్ హాహాకారాలు చెయ్యటంతో ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తీవ్ర గాయాలపాలైన గిరిధర్ ను ఆసుపత్రికి తరలించారు.

తనను వేధిస్తున్న కారణంగానే వేడినూనె పోశానన్న భార్యపై కేసు నమోదు
తనను వేధిస్తున్న కారణంగానే భర్తపై కాగే నూనె పోశానని అంగీకరించిన భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ గిరిధర్ వివాహేతర సంబంధాలతో తనను వేధిస్తున్నాడని, విజయవాడలో గిరిధర్ పై భార్య ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక కుల్సుంపురా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications