చిన్నారి హత్యాచారం: సాయి ధరమ్ తేజ్ను కాదు.. ఇలాంటివి చూపించండి-మీడియాపై భగ్గుమన్న మంచు మనోజ్
హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనలో ఇప్పటికీ నిందితుడి ఆచూకీ దొరకలేదు. ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా పోలీసులకు నిందితుడి జాడ చిక్కట్లేదు. నిందితుడి వద్ద సెల్ఫోన్ లేకపోవడంతో... అతను ఎక్కడున్నాడనేది కష్టంగా మారినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం 10 పోలీస్ స్పెషల్ టీమ్స్ నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు,మంత్రి కేటీఆర్ మాత్రం ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారంటూ రెండు రోజుల క్రితం ట్వీట్ చేయడం గమనార్హం. దీంతో ఈ ఘటనలో నిందితుడి అరెస్టుపై ఒకింత గందరగోళానికి తావిచ్చినట్లయింది. తాజాగా బాధిత కుటుంబాన్ని నటుడు మంచు మనోజ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ అంశాన్ని ప్రస్తావించిన మనోజ్ మీడియాపై ఫైర్ అయ్యారు.
Recommended Video

ఇలాంటి కేసుల్లో 24గంటల్లో శిక్షలు పడాలి : మంచు మనోజ్
'పసిపాపపై జరిగిన కౄరత్వంపై వాళ్ల తల్లిదండ్రులతో ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ తల్లి కాళ్ల మీద పడి ఏడుస్తుంటే నిస్సహాయంగా అనిపించింది. చేతకానివాడిలా అనిపించింది. వ్యవస్థలో ఈ లోపం క్రియేట్ చేసినందుకు మనందరం బాధ్యత తీసుకోవాలి.ఆడపిల్లలు,మహిళలను ఎలా గౌరవించాలనేది పిల్లలకు ఎప్పుడూ నేర్పిస్తూ ఉండాలి.ఆరు రోజులైంది ఇంకా ఆ రాక్షసుడి ఆచూకీ దొరకలేదు. పోలీసులంతా బాగా కష్టపడుతున్నారు... వెతుకుతున్నారని విన్నాను.సీఐతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాను.ప్రతీ ఒక్కరూ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఛత్తీస్గఢ్లో గతేడాది జరిగిన రేప్ కేసుకు ఇప్పుడు ఉరిశిక్ష పడింది.కానీ సంవత్సరం కాదు... ఇలాంటి కేసుల్లో తక్షణం 24గంటల్లో శిక్ష పడేలా చేయాలి.' మంచు మనోజ్ పేర్కొన్నారు.

'సాయి ధరమ్ తేజ్ను కాదు... ఇలాంటివి హైలైట్ చేయండి'
'ప్రతీ సోషల్ మీడియా,మీడియా చానెళ్లు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకుని నిందితుడి కోసం జల్లెడ పట్టండి.వెతికి అతన్ని దగ్గరున్న పోలీస్ స్టేషన్కు అప్పజెప్పండి. ఇది నా రిక్వెస్ట్.టీవీ చానెల్ ఆన్ చేస్తే సాయి ధరమ్ తేజ్ అలా పడ్డాడు... ఇలా పడ్డాడని 3డీ చేసి మరీ చూపిస్తున్నారు.ఇలాంటివి ఎప్పుడు చూపిస్తారు.దీన్ని హైలైట్ చేయండి.వాని ఫోటో విడుదల చేసి వాడిని అరెస్టయ్యేలా చూడండి.సారీ అన్నా... మీకు జరిగిన అన్యాయం తీర్చలేని లోటు... న్యాయం జరుగుతుంది అందరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు... ఇంతకుముందు దిశకు న్యాయం చేశారు,ఇప్పుడు కూడా న్యాయం చేస్తారు... మీకు మేం కుటుంబానికి అండగా ఉన్నాం.' అని మంచు మనోజ్ ఆగ్రహం,ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలన్నదే బాధిత కుటుంబం డిమాండ్ అని అక్కడున్నవారు చెప్పగా... ఆ మేరకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు మనోజ్ పేర్కొన్నారు.

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాపై ప్రజాగ్రహం...
చిన్నారిపై అత్యాచార ఘటన విషయంలో తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి ఇచ్చినంత కవరేజీ చిన్నారి హత్యాచార ఘటనకు ఇవ్వకపోవడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నేత సంపత్ నాయక్ బృందం సోమవారం(సెప్టెంబర్ 13) అపోలో ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగింది. మీడియా తీరుపై సంపత్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.'ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనకు గురైతే...ఆ ఘటనకు తెలుగు మీడియాలో కవరేజీ లేదు.అదే ఓ హీరోకు రోడ్డు ప్రమాదం జరిగితే తెలుగు మీడియా మొత్తం ఆ వార్తలే చూపిస్తోంది.మనం ఏ సమాజంలో ఉన్నాం.మీడియా అంటే కేవలం డబ్బున్నోడికేనా... కేవలం హీరోలనే చూపిస్తారా...' అంటూ ఫైర్ అయ్యారు. సిగ్గు సిగ్గు అగ్రవర్ణాల మీడియా అంటూ నినాదాలు చేశారు.ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ సైతం మీడియా తీరును తప్పు పట్టారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మొదటి వ్యక్తి మనోజే కావడం గమనార్హం.
గిరిజన బాలిక కాబట్టే నిర్లక్ష్య వైఖరి అంటూ...
హత్యాచారానికి గురైన బాలిక గిరిజన వర్గానికి చెందినదిగా కాబట్టే అటు ప్రభుత్వం,ఇటు మీడియా పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే సీతక్క సైతం ప్రభుత్వంపై ఇవే ఆరోపణలు చేశారు. దిశ విషయంలో ఒక న్యాయం.. గిరిజన బాలిక విషయంలో మాత్రం నిర్లక్ష్యమా అంటూ ప్రశ్నించారు. కింది కులాల ఆడపిల్లలకు ఏం జరిగినా ప్రభుత్వం పట్టించుకోదా అని నిలదీశారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ప్రజల్లో నుంచి తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.ఆధిపత్య కులాల పాలనలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలకు న్యాయం జరగదన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

నిందితుడిని తప్పించిన స్నేహితుడు...
చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు ఆటోడ్రైవర్ రాజును అతని స్నేహితుడు తప్పించినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి కనిపించకుండా పోవడంతో... కుటుంబ సభ్యులంతా ఆమె కోసం వెతుకుతున్న సమయంలో రాజు స్నేహితుడు అతన్ని అలర్ట్ చేశాడు. ఇక్కడ ఉంటే దొరికిపోతావని... ఎక్కడికైనా పారిపోవాలని అతను సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు,అక్కడి నుంచి సేఫ్గా బయటపడేందుకు.. ముఖానికి మాస్కు,తువ్వాలు,సంచిలో ఒక జత దుస్తులు ఇచ్చి అక్కడినుంచి పంపించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇది నిజమేనని తేలింది. రాజుకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు రాజుకు గంజాయితో పాటు గుడుంబా అలవాటు ఉన్నట్లు గుర్తించారు. నిత్యం తాగడం ఎక్కడపడితే అక్కడ పడిపోవడం అతనికి అలవాటుగా మారిందని గుర్తించారు.












Click it and Unblock the Notifications