పాములు కావాలా బాబు..! అమ్మకానికి కొండచిలువ
హైదరాబాద్ : ఏది కావాలన్నా ఇంట్లో నుంచి ఆర్డరిస్తే చాలు.. వాయువేగంతో మన చెంతకు చేరుతున్న రోజులివి. పెరిగిన టెక్నాలజీతో అందివస్తున్న అవకాశాలెన్నో. అయితే కొందరు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం గమనార్హం. తాజాగా మేడ్చల్ జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాశంగా మారింది.
మా దగ్గర పాములున్నాయి, కొంటారా? అంటూ ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో పెట్టిన బేరం చివరకు బెడిసికొట్టింది. ఘట్కేసర్ మండలం చౌదర్గూడ లోని వెంకటాద్రి టౌన్షిప్ నివాసి షారన్ మోసెస్ అటవీశాఖ నిబంధనలు అతిక్రమించాడు. కొండ చిలువతో పాటు మరో పామును తన ఇంట్లో అక్రమంగా దాచిపెట్టాడు. అక్కడితో ఆగకుండా తన స్నేహితుడు ప్రవీణ్ తో కలిసి వాటిని అమ్మే ప్రయత్నం చేశాడు. ఈమేరకు సోషల్ మీడియాలో వాటి ఫోటోలు పెట్టి అమ్మకానికి రెడీ అంటూ బేరం పెట్టారు. ప్రవీణ్ కొండచిలువను తన మెడలో వేసుకుని ఫోజులిచ్చిన ఫోటోను వాట్సాప్, ఫేస్బుక్ తదితర వాటిలో అప్లోడ్ చేశారు.

పాముల బేరం ఫోటోలు వైరల్ గా మారడంతో విషయం కాస్తా అటవీశాఖ అధికారులకు చేరింది. దీంతో వారి అడ్రస్ కనుక్కుని సోదాలు నిర్వహించారు. రెండు పాములను స్వాధీనం చేసుకుని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. రంగారెడ్డి మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిందితులిద్దరికీ ఏడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉండొచ్చంటున్నారు అటవీశాఖ అధికారులు.












Click it and Unblock the Notifications