HCU: క్యాంపస్.. హార్రర్: జెఎన్యూ విద్యార్థులపై దాడి: భగ్గుమన్న సెంట్రల్ వర్శిటీ: అర్ధరాత్రి ర్యాలీ..
హైదరాబాద్: దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్యూ) విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఉదంతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో సెగ పుట్టించింది. జెఎన్యూ విద్యార్థులపై దాడిపై భగ్గుమన్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వారు క్యాంపస్ లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
రిజైన్ అమిత్ షా..
జెఎన్యూ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిలో భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హస్తం ఉందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఈ దాడికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. విద్యార్థులపై చోటు చేసుకున్న దాడికి నైతిక బాధ్యత వహిస్తూ అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులతో ఆటలా..
ఢిల్లీ పోలీసులు యూనివర్శిటీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని, దాడులు కొనసాగిస్తున్నారనే విషయం ఈ ఉదంతంతో మరోసారి స్పష్టమైందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు ఆరోపించారు. ఇదివరకు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రదర్శనల సందర్భంగా ఢిల్లీ పోలీసులు జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఇప్పుడు దాడులకు పాల్పడుతున్న వారికి అండగా నిలిచారని ఆరోపించారు.
Recommended Video
విద్యార్థులకు రక్షణ లేదా?
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్దిరోజుల కిందట జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనల సమయంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఢిల్లీ పోలీసులు జామియా యూనివర్శిటీ క్యాంపస్ లోకి ప్రవేశించినట్టుగానే.. ఈ సారి జెఎన్యూ తమ టార్గెట్ గా చేసుకున్నారని, తమకు రక్షణ కల్పించాలని పట్టుబట్టారు. యూనివర్శిటీలకు భద్రత కల్పించాలని నినదించారు.
ట్యాంక్ బండ్ వద్ద..
జెఎన్యూ విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారనే సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే పలువురు విద్యార్థులు.. ట్యాంక్ బండ్ సమీపంలోని రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. నినాదాలు చేశారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఈ దాడికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.