నేను.. బీజేపీలో లేను, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను : టీ రాజా సింగ్ సంచలనం
హైదరాబాద్: వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారతీయ జనత పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం- దుమారం రేపుతోంది. అధికార టీఆర్ఎస్పై మాటల దాడి తీవ్రతరమైంది. బీజేపీ శ్రేణులన్నీ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను లక్ష్యంగా చేసుకున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి.
ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదంటూ..
ఇవ్వాళ్టి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలోని భైంసాలో తన పాదయాత్రను ఆయన ప్రారంభించాల్సి ఉంది. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భైంసా అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతంగా భావిస్తోండటం వల్లే అనుమతి లభించలేదని చెబుతున్నారు. శాంతిభద్రతల సమస్య ఏర్పడొచ్చనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యగా ఆయనను పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.
బండి సంజయ్ అరెస్ట్తో..
అనుమతి లేకపోయినప్పటికీ.. తన పాదయాత్రను ప్రారంభించడానికి భైంసా వెళ్లడానికి ప్రయత్నించిన బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల సమీపంలో బండి సంజయ్ వెళ్తోన్న వాహనాన్నిఅడ్డగించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇది కాస్తా బీజేపీ నేతల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చివరి క్షణంలో అనుమతి నిరాకరణపై
తనను అరెస్ట్ చేయడం పట్ల బండి సంజయ్ మండిపడ్డారు. పాదయాత్ర చేపట్టడానికి అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకున్న తరువాత చివరి నిమిషంలో అనుమతి లేదని చెప్పడాన్ని తప్పుపట్టారు. అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఎం కావాలని ఆయన ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లయినా సరే పాదయాత్రకు అనుమతి తెచ్చుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.
బండి సంజయ్ అరెస్ట్ పట్ల నిరసన
బండి సంజయ్ అరెస్ట్ పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటోన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందంటూ విమర్శించారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా, లోక్సభ సభ్యుడిగా ఉన్న బండి సంజయ్కు రాష్ట్రంలో తిరిగే స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించారు. భైంసా సభను అడ్డుకోవడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ తనకు తాను నయా నిజాం అనుకుంటున్నాడంటూ ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు..
బండి సంజయ్ అరెస్ట్ను సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ తప్పుపట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర అంటే కేసీఆర్, కేటీఆర్కు నిద్ర పట్టట్లేదని ఆరోపించారు. కేసీఆర్ ఎనిమిదో నిజాంలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తోన్నారని మండిపడ్డారు. నిజాం తరహాలో కేసీఆర్.. కుటుంబ వారసత్వంగా అధికారాన్ని తన కుమారుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోన్నారని, దీన్ని బండి సంజయ్ అడ్డుకుంటోన్నారని చెప్పారు.
బండి సంజయ్ ఫాలోవర్ను..
తాను ఇప్పుడు బీజేపీ శాసన సభ్యుడిని కాదని టీ రాజా సింగ్ తేల్చి చెప్పారు. పార్టీ తనను సస్పెండ్ చేసిందనే విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. తానిప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు. బండి సంజయ్ అనుచరుడిగా, ఆయనను అభిమానించే బీజేపీ కార్యకర్తగా మాత్రమే మాట్లాడుతున్నానని వివరించారు. పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తోందని ధ్వజమెత్తారు. వెంటనే బండి సంజయ్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.