40 వేల మందికి ఉచిత భోజనం: నిమ్స్, ఎర్రగడ్డ, చెస్ట్ ఆస్పత్రులను సందర్శించిన మంత్రులు
నిమ్స్,, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటళ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సందర్శించారు. కరోనా వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్న బాధితుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న వైద్యసేవల గురించి వైద్యులను అడిగారు. కరోనా మహమ్మారి బారిన పడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందన్న భరోసా కల్పిస్తుందని మంత్రులు చెప్పారు.
చెస్ట్ ఆస్పత్రిలో సిటీస్కాన్, అల్ట్రా సౌండ్ పరికరాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తెలిపారు. 94 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 9.10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ను వేశామన్నారు. ఇందులో మొదటి డోస్ కింద 5.91 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దన్నారు. లాక్డౌన్తో ఆహారం కోసం ఇబ్బందులు తలెత్తకుండా నగరంలో 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 40 వేల మందికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తెలిపారు.
Visited Govt General and Chest Hospital in Erragadda to inspect COVID-19 facilities along with Colleague Minister @mahmoodalitrs Saab. #TelanganaFightsCorona pic.twitter.com/3J3JrjZZj1
— Talasani Srinivas Yadav (@YadavTalasani) May 25, 2021