అక్బరుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తున్న ఈ కాంగ్రెస్ 'ఛాంపియన్' ఎవరు?
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ సారి హైదరాబాద్ పై ప్రతి ఒక్కరి దృష్టి ఉంది. ఎందుకంటే మజ్లిస్ తనకు బలమున్న ఏడు స్థానాల్లో పోటీచేస్తుండగా ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడైతే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారో అక్కడ టీఆర్ఎస్కు ఓటు వేయాల్సిందిగా మజ్లిస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ సారి చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎన్నికలు కాస్త ఆసక్తికరంగా మారాయి. ఇక్కడి నుంచి ఇప్పటికే బలమైన అభ్యర్థిగా మజ్లిస్ పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఇక ఆయనపై పోటీకి కాంగ్రెస్ ఛాంపియన్ను రంగంలోకి దింపింది. ఇంతకీ ఈ ఛాంపియన్ ఎవరనేగా అయితే పూర్తిగా ఈ కథనాన్ని చదవండి.
చాంద్రాయణగుట్ట ఛాంపియన్ ఈసా మిస్రా
ఈసా మిస్రీ... ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ చాంద్రాయణగుట్టలో మాత్రం ఈ పేరు చాలా పాపులర్. ఎందుకంటే ఈసా మిస్రీ అనే ఈ వ్యక్తి కండలు తిరిగిన మలయోధుడు. మంచి బాడీ బిల్డర్. ప్రస్తుతం ఈసా మిస్రీ పేరు చాంద్రాయణగుట్టలో తెగ వినపడుతోంది. ఇందుకు కారణం చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం నుంచి మజ్లిస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ పై కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు ఈ బాడీ బిల్డర్ ఈసా మిస్రీ . అక్బరుద్దీన్పై పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అథ్లెట్
ఈసా మిస్రీ రెండో తరానికి చెందిన అథ్లెట్. యెమెన్కు చెందిన ఈసా మిస్రీ ముందుగా బాడీ బిల్డర్. ఆ తర్వాత వ్యాపారవేత్తగా మారాడు. చాంద్రాయణ గుట్ట కేంద్రంగా తన వ్యాపారాలను విస్తరించాడు. తను మిస్రీ జాతికి చెందిన వాడినని చెప్పాడు ఈసా మిస్రీ. అయితే చాంద్రాయణ గుట్టకు మాత్రం తాను సుపరిచితుడినేనని చెప్పాడు. తన తల్లి చాంద్రాయణగుట్ట నివాసి అని వెల్లడించాడు. తన వ్యాపారాలు నివాసాలు చాంద్రాయణ గుట్టలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే చాంద్రాయణ గుట్ట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఈసా మిస్రీ మజ్లిస్ బీజేపీ పార్టీలతో తలపడనున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు చాంద్రాయణగుట్టలో మతం ముసుగులో రాజకీయాలు చేస్తున్నాయని ఇక్కడి ప్రజల్లో మతం అనే విషం నాటాయని మండిపడ్డారు. మత రాజకీయాలను ఎప్పుడైతే పారద్రోలుతామో అభివృద్ధి అనేది ఆటోమేటిగ్గా కనిపిస్తుందని మిస్రీ చెప్పారు. మత రాజకీయాలను రూపుమాపేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు మిస్రీ. మంచి రాజకీయాలు, విలువలతో కూడిన రాజకీయాలు వ్యవస్థలోకి రావాలని తద్వారా అన్ని వర్గాల వారు బాగుపడాలని కోరారు.
బలమైన నేత అక్బరుద్దీన్ను ఎలా ఎదుర్కొంటారు?
ఇప్పటికే తన నియోజకవర్గంలో గత పదకొండు నెలలుగా తిరుగుతున్నానని చెప్పిన మిస్రీ... ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. చాలామందిని తాను వ్యక్తిగతంగా కలుసుకున్నట్లు చెప్పిన ఈసా మిస్రీ... వారంతా తనకు అండగా నిలుస్తామని మాట ఇచ్చారని తనకే ఓటు వేస్తారని తాను భావిస్తున్నట్లు మిస్రీ చెప్పారు. ఇక్కడి నియోజకవర్గంలోని ప్రజలు చాంద్రాయణగుట్ట మాజీ ఎమ్మెల్యే మజ్లిస్ బచావో తహ్రీక్ వ్యవస్థాపకులు అమానుల్లా ఖాన్ తమకు ఇకపై ఎమ్మెల్యేగా వద్దనుకున్నారని... మార్పు కోసం అతన్ని ఓడించారని గుర్తుచేశారు మిస్రీ. ఇప్పుడు కూడా అదే మార్పును మరోసారి ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. తాను ఎమ్మెల్యే అయితే ముందుగా ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారిస్తానని చెప్పారు. ప్రజాఆరోగ్య వ్యవస్థలో మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ మందులు తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చూస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే తన ఇద్దరి కుమారులు అహ్మద్ మిస్రీ, ఉస్మాన్ మిస్రీలు కూడా బాడీ బిల్డర్లే అని చెప్పారు. అంతేకాదు ఓ అంతర్జాతీయ టోర్నమెంటులో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారని చెప్పారు.