నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా- నిన్ను మీ అన్న, మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. ఈ కేసులో విచారణ కొనసాగిస్తోన్న కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ ఇప్పటికే ఛార్జ్షీట్ను ఫైల్ చేసింది. ఇందులో మొత్తం ఏడుమంది పేర్లను నమోదు చేసింది. ఇదే కేసులో సీబీఐ అధికారులు భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను సైతం విచారించింది. ఆమె స్టేట్మెంట్ను నమోదు చేసింది.

మనీలాండరింగ్ కోణంలో..
ఈ కేసులో బోయిన్పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ సహా మరో అయిదుమంది పేర్లను సీబీఐ అధికారులు ఛార్జ్షీట్లో చేర్చారు. అభిషేక్ రావు, విజయ్ నాయర్ ఇదివరకే అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కోట్ల రూపాయల మేర చేతులు మారినట్లు సమాచారం అందిన నేపథ్యంలో- ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా జోక్యం చేసుకున్నారు. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు సాగిస్తోన్నారు.

లాబీయింగ్..
ఆర్థిక నేరాలను నివారించడానికి ఏర్పాటైన ఈ దర్యాప్తు సంస్థ- బోయిన్పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ను అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ విధానం రూపకల్పనలో- హైదరాబాద్కు చెందిన బోయిన్పల్లి అభిషేక్ దక్షిణాదికి చెందిన లిక్కర్ బరూన్తో లాబీయింగ్ నిర్వహించారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ విషయాన్ని సీబీఐ తన ఛార్జ్షీట్లో పొందుపరిచింది.

కవిత పేరు..
ప్రముఖ లిక్కర్ కంపెనీ ఇండోస్పిరిట్ ప్రమోటర్ సమీర్ మహంద్రు, జనరల్ మేనేజర్ పెర్నోడ్ రికర్డ్, బినోయ్ బాబు, అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్, ప్రమోటర్ పీ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. బోయిన్పల్లి అభిషేక్ రావు తెలంగాణకు చెందిన వ్యాపారవేత్తే కావడం వల్ల ఆయనతో కాంట్రాక్ట్స్ ఉన్న వారు ఇబ్బందులను ఎదుర్కొనవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈడీ నమోదు చేసిన చార్జిషీట్లో కల్వకుంట్ల కవిత పేరు సైతం పొందుపరిచినట్లు వస్తోన్న వార్తలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.

మాటల యుద్ధం..
ఈ పరిణామం- బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధానికి దారి తీస్తోంది. ఈ రెండు పార్టీల నాయకులు ప్రతిరోజూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూనే ఉన్నారు. తాజాగా బీజేపీ నాయకుడు, నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- కవిత మధ్య ఇదే విషయంపై మాటల యుద్ధం చోటు చేసుకుంది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై వారిద్దరూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటోన్నారు.

కోమటిరెడ్డి వర్సెస్ కవిత..
కవితను లిక్కర్ క్వీన్గా అభివర్ణించారు. చార్జిషీట్లో ఆమె పేరు 28 సార్లు ప్రస్తావనకు వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి కవిత్ అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డిని అన్నా.. అని సంబోధించారు. తొందరపడి మాట జారొద్దంటూ హితవు పలికారు. ఛార్జ్షీట్లో తన పేరు 28 సార్లు చెప్పించారని ఆరోపించారు. 28 సార్లు చెప్పించినా.. 28 వేల సార్లు తన పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదని కవిత స్పష్టం చేశారు.

నిజం నిప్పులాంటిది..
దీనికి ఆయన కోమటిరెడ్డి స్పందించారు. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. అంటూ బదులిచ్చారు. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు.. అని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తనను రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు ఎన్నో ఆరోపణలు గుప్పించారని ధ్వజమెత్తారు. పారదర్శకరంగా, టెండర్ ద్వారా వచ్చిన 18,000 కోట్ల రూపాయల విలువ చేసే బొగ్గు గనుల టెండర్ విషయంలో తనపై విష ప్రచారం చేశారని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలుకు వెళ్లడం ఖాయం అని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications