పోలీసులు దురుసుగా ప్రవర్తించొద్దు, ప్రజలు సహకరించాలి: నైట్ కర్ఫ్యూపై డీజీపీ కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి నైట్ కర్ఫ్యూ ప్రకటించిన నేపథ్యంలో పోలీసు జోనల్ ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
44 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసుల వృథా: తమిళనాడు టాప్, ఆ జాబితాలో తెలంగాణ కూడా
కర్ఫ్యూ నిబంధనలపై పౌరులను చైతన్యపర్చాలని డీజీపీ పోలీసులకు సూచించారు. స్వీయరక్షణకు ఎంత బాధ్యతగా ఉంటామో సమాజ శ్రేయస్సు విషయంలోనూ అంతేగా బాధ్యతగా ఉంటూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఆయన పోలీసులకు పలు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వ జీవోలో పేర్కొన్న నిబంధనల ప్రకారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధిగా కర్ఫ్యూ అమలు చేయాలన్నారు. అంతేగాక, కర్ఫ్యూ సమయంలో పౌరులతో దురుసుగా ప్రవర్తించరాదని స్పష్టం చేశారు. అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలను రాత్రి 8 గంటల వరకు మూసివేసేలా చూడాలన్నారు.
అయితే, సరుకు రవాణా చేసే వాహనాలను ఆపకూడదని డీజీపీ స్పష్టం చేశారు. తమ పరిధిలోని వివిధ సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో కర్ఫ్యూ నిబంధనలపై సమావేశం నిర్వహించి చైతన్య పర్చాలని డీజీపీ సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. కాగా, నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులివే
మాస్కు ధరించకపోతే రూ. 1000 జరిమానా విధించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సినిమా థియేటర్లను కూడా మూసివేస్తున్నట్లు థియేటర్ల యాజమాన్య సంఘం ప్రకటించింది.
తెలంగాణ కొద్ది వారాలుగా కరోనా కేసులు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా 5వేల మార్క్ని చేరాయి. ఆదివారం(ఏప్రిల్ 18) రాత్రి 8గం. నుంచి సోమవారం రాత్రి 8గం. వరకు 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1856కి చేరింది. ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,16,650కి చేరింది.