తెలంగాణా ఈఎస్ఐ మందుల భారీ కుంభకోణం .. విస్తుబోయే వాస్తవాలు.. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి అరెస్ట్
తెలంగాణ ఈఎస్ఐలో మెడిసిన్స్ కొనుగోలులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ప్రధాన సూత్రధారిగా మందులు, వైద్యపరికరాల కొనుగోలులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు కొనుగోలు చేసి సుమారు రూ.100 కోట్లకు పైగా కుంభకోణానికి తెరతీశారని విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఇక దీంతో ఈరోజు షేక్ పేటలోని ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
అర్హతలు లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారన్న కుంభకోణంలో ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని అరెస్ట్ చేశారు పోలీసులు. దేవికారాణి మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అవసరం లేకపోయినా ఏడాదికి సంబంధించి మందులను, వైద్య పరికరాలను ఒకేసారి కొనుగోలు చేశారని, పదివేల రూపాయలు విలువ చేసే మందులను లక్ష రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఏసీబీ, ఆడిటింగ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్ధారించారు.

ఏకకాలంలో 23మంది ఇళ్ళపై సోదాలు .. పలు కీలక పత్రాలు స్వాధీనం
అంతేకాదు ఆమె అస్మదీయులను , బంధువులను కోట్లాది రూపాయల విలువ చేసే మందుల కొనుగోలులో బినామీలుగా వాడుకున్నారని కూడా అధికారులు నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన బంధువులు 23 మంది ఇళ్ళలో 26వ తేదీన ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. దాదాపు 24 గంటల పాటు నిర్వహించిన సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది పది కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్టు పత్రాలను గుర్తించారు ఏ సిబి అధికారులు.

మెడిసిన్స్ స్కామ్ లో 100 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ప్రాథమిక అంచనా
అంతేకాదు 100 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చిన అధికారులు ఈ స్కామ్ లో దేవికారాణి పాత్ర నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
ఇక గతంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో మందుల కొనుగోలులో భారీస్కాంపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఆడిటింగ్ అధికారులు ఆమె కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు. . దేవికారాణి సుమారు రూ.100 కోట్లకు పైగా కుంభకోణాలకు పాల్పడినట్లు అప్పుడే నిర్ధారించినట్లు సమాచారం.

దేవికా రాణిని విచారించనున్న ఏసీబీ అధికారులు
ఈ కుంభకోణంలో దేవికారాణితోపాటు ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు, ఒక ఫార్మసి స్టోర్ జేడీ, ఇద్దరు ఫార్మసిస్ట్ ల పాత్ర ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషికి నివేదిక అందజేశారు.ఈ కేసుపై విచారణలో తీగ లాగితే డొంకంతా కదులుతుంది . దీంతో నేడు, సెప్టెంబర్ 27వ తేదీన దేవికారాణిని ఆమె నివాసంలో అరెస్టు చేశారు . ఈఎస్ఐ లో భారీ మందుల స్కామ్ కు పాల్పడిన దేవికారాణి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, పలు బినామీ కంపెనీలు కూడా ఆమెకు ఉన్నాయి అని గుర్తించిన అధికారులు దేవికారాణిని విచారించనున్నారు. ఇక ఈ ఎస్ ఐ డైరెక్టర్ దేవికారాణి విచారణతో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications