తెలంగాణ ఆలయాల్లో భక్తులకు ఎంట్రీ: తలనీలాలు, గదుల అద్దె కష్టమే: దర్శనానికి మాత్రమే ఛాన్స్
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న 14 రోజుల నాలుగోదశ లాక్డౌన్ ముగింపు దశకు వచ్చిన వేళ.. కేసీఆర్ సర్కార్ మరిన్ని సడలింపులను ప్రకటించే అవకాశం ఉంది. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 24వ తేదీ నుంచి రెండు నెలలకు పైగా మూతపడ్డ ఆలయాల్లో భక్తుల రాకను పునరుద్ధరించే దిశగా చర్యలను చేపట్టబోతోంది. శుక్రవారం కొండపోచమ్మ ఆలయాన్ని సందర్శించబోతోన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అక్కడే చండీ హోమాన్ని నిర్వహించ తలపెట్టారు. ఈ సందర్భంగా దశలవారీగా ఆలయాల్లో భక్తుల రాకపై విధించిన నిషేధాన్ని సడలించాలని నిర్ణయించినట్లు సమాచారం.

దశలవారీగా.. జిల్లాల వారీగా..
అన్ని ఆలయాల్లో ఒకేసారి కాకుండా దశలవారీగా భక్తులకు ఎంట్రీ కల్పించాలనే ప్రతిపాదనలను కేసీఆర్ సర్కార్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. తొలిదశలో కొన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులకు ప్రవేశం కల్పించాలని, అనంతరం దాన్ని మిగిలిన ఆలయాలకు విస్తరింపజేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై దేవాదాయ మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఒకేసారి ఆలయాలను తెరవనివ్వకుండా నాన్ కంటెయిన్మెంట్లు, గ్రీన్జోన్ ప్రాంతాల్లో ఆలయాలను పునరుద్ధరించేలా ప్రభుత్వం ఓ యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తోందని సమాచారం.

పూజలు ఉండవ్.. దర్శనాలకు మాత్రమే ఛాన్స్
ఈ సందర్భంగా ఆలయంలోని మూల విరాట్టులకు పూజలను నిర్వహించే అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దర్శనాలకు మాత్రమే అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవచ్చు. స్వామివారికి కొబ్బరికాయలను కొట్టడం, పూజలను నిర్వహించడం వంటి చర్యలపై నిషేధాన్ని కొనసాగిస్తూనే.. భక్తులు దూరం నుంచి స్వామివారిని దర్శించుకునేలా మాత్రమే చర్యలు చేపట్టవచ్చని అంటున్నారు. పూజలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం వల్ల భక్తుల రద్దీ పెరుగుతుందని, ఫలితంగా సోషల్ డిస్టెన్సింగ్ను పాటించే అవకాశం ఉండదనేది ప్రభుత్వం భావన. ప్రధాన ఆలయాల వద్ద శానిటైజర్ టన్నెల్ను ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది.

గదులు కూడా దొరకవ్..
ప్రధాన ఆలయాలను దర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అక్కడే గదులను అద్దెకు తీసుకుని ఒకట్రెండు రోజులు నిద్రించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధానానికి కూడా అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. భద్రాద్రి, ధర్మపురి, యాదాద్రి, కొండగట్టు, కొమురవెల్లి వంటి ప్రధాన ఆలయాల్లో ఒక్కరోజైనా నిద్రించే భక్తుల సంఖ్య వందల్లో ఉంటుంది. వారికి ఆ అవకాశం ఇప్పట్లో లభించనట్టే. దీనితోపాటు మొక్కుబడులను చెల్లించడం, తలనీలాలను సమర్పించడం వంటి పనులను కూడా చేయకూడని విధంగా మార్గదర్శకాలను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

జూన్ రెండోవారంలో
చాలావరకు వచ్చేనెల రెండోవారంలో ఆలయాలను భక్తుల కోసం తెరిచే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నామని అంటున్నారు. ఆలయాలకు రావాలనుకునే ప్రతి భక్తుడు కూడా శానిటైజర్ టన్నెల్ ద్వారా ఆలయం లోపలకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. భౌతికదూరం పాటించేలా, మాస్క్ ధరించేలా నిబంధనలను రూపొందించబోతున్నారు. కర్ణాటక నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం ఆలయాల్లో భక్తుల ఎంట్రీపై కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications