సాయి గణేశ్ ఇష్యూపై హైకోర్టు నోటీసులు.. కమ్మ మంత్రిని ఒక్కడినే, టార్గెట్ చేశారంటోన్న పువ్వాడ
ఇటీవల బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల వల్లే చనిపోయాడు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. పువ్వాడను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు కూడా స్పందించింది. ధర్మాసనం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా స్పందించాలని పేర్కొంది.
నోటీసులు
సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని దాఖలైన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టింది. నోటీసులు జారీచేసి.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. టీఆర్ఎస్ నేతల ప్రోత్సాహంతో పోలీసులు తనపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ చెబుతోంది. సాయి గణేశ్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వెలికితీయడంతో పాటు అందుకు బాధ్యులెవరనే విషయంపైనా నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ మేరకు కేసు విచారణ చేపట్టింది.
అమిత్ షా ఫోన్.. పువ్వాడ రియాక్షన్
ఖమ్మంకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకోగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాయి గణేశ్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనను బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయే అని... ఆయనను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై మంత్రి పువ్వాడ స్పందించారు. ఖమ్మంలో చిన్న ఘటన జరిగితే దాన్ని అడ్డం పెట్టుకుని తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదీ సరికాదని ఆయన అంటున్నారు.
కమ్మ మంత్రిని ఒకడినే
కుట్ర చేస్తున్న వారితో చాలా మంది చేతులు కలిపారని పువ్వాడ అజయ్ అన్నారు. వారెవరో తనకు తెలుసు అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక కమ్మ మంత్రిని తానే అని చెప్పారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కమ్మ వారికి ఉన్న ఏకైక మంత్రి పదవీని తీసివేశారని చెప్పారు. ఇప్పుడు ఉన్న ఒక మంత్రిని తానేనని వివరించారు. తన పదవీ కూడా తీసివేయడానికి కుట్ర జరగుతుందని చెప్పారు.